ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజస్వీ యాదవ్‌ను ఆర్జేడీ నెం. 2గా ప్రకటించిన లాలూ

national |  Suryaa Desk  | Published : Sun, Jan 25, 2026, 08:42 PM

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ .. తన చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌ను పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆదివారం పట్నాలో జరిగిన ఆర్జేడీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో లాలూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆర్జేడీ అగ్రనేతల సమక్షంలో తేజస్వీకి లేఖను తండ్రి అందజేశారు. లాలూ కుటుంబంలో విబేధాలు కొనసాగుతోన్న వేళ ఆర్జేడీలో నెంబరు 2గా తేజస్వీని ప్రకటించడం ప్రాధాన్యత ఏర్పడింది.


 లాలూ, రబ్రీ దేవిల చిన్న కుమారుడైన తేజస్వీ ఆర్జేడీలో ముఖ్య నేతగా కొనసాగుతున్నారు. 2020 బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించడంలో తేజస్వీ కీలక పాత్ర పోషించారు. 2015, 2022లో బిహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చురుకుగా ప్రచారం నిర్వహించారు. యువత ఎక్కువ శాతం మంది ఆయనే సీఎం కావాలని కోరుకున్నారు. లాలూ కుటుంబానికి కంచుకోట రాఘోపుర్‌ నుంచి పోటీ చేసి, వరుసగా మూడోసారి విజయం సాధించారు. అయితే, ఆర్జేడీ పార్టీ మాత్రం ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసింది.


ఇదిలా ఉండగా, తేజస్వీ యాదవ్ నియమానికి కొద్ది గంటల ముందు లాలూ కుమార్తె రోహిణి ఆచార్య.. తన కుటుంబ సభ్యులపై మరోసారి తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీని కొందరు పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు ప్రజల హక్కుల కోసం పోరాడిన పార్టీ ఇప్పుడు ప్రత్యర్ధులు పంపిన చొరబాటుదారులు, కుట్రదారుల చేతుల్లోకి వెళ్తోందని రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్జేడీ దుస్థితికి కారణమైన అటువంటి వారిని ఆర్జేడీ కార్యకర్తలే ప్రశ్నిస్తారని ఆమె వ్యాఖ్యానించారు.


‘పార్టీ నిజమైన ఆశయం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం.. నేడు ప్రత్యర్థులు పంపిన చొరబాటుదారులు, కుట్రదారుల చేతుల్లో ఉంది. వారి ఏకైక లక్ష్యం ‘లాలుయిజం’ను నాశనం చేయడమే... అలాంటి వ్యక్తులు తమ దురుద్దేశాలలో చాలా వరకు విజయం సాధించినట్లు అనిపిస్తుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.


‘వారు 'లాలూయిజం'.. పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడే వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. పార్టీ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తులతో వారు అసభ్యంగా ప్రవర్తిస్తారు. 'అతడు' మౌనంగా ఉంటే, పార్టీ, 'లాలూయిజం'పై కుట్ర పన్నుతున్న ముఠాతో సంబంధం ఉన్నారనే ఆరోపణలు నిజమవుతాయి’ అని ఆమె పేర్కొన్నారు. పార్టీ కీలక సంస్థాగత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ తన భవిష్యత్తు కార్యచరణను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో రోహిణి ఆరోపణలు అంతర్గత చర్చకు దారితీశాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతర లాలూ కుటుంబంలో ముసలం పుట్టిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తెలు అందరూ ఇంటి నుంచి వెళ్లిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa