మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి విమానాశ్రయంలోని టేబుల్టాప్ రన్వేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు ఇలాంటి రన్వేలు ఎందుకు ప్రమాదకరం అనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ల్యాండింగ్ సమయంలో విమానం కంట్రోల్ తప్పడం, పైలట్ సరిగా అంచనా వేయకపోవడం వల్ల గతంలో ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలపై విమాన ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు కూడా అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం.. ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఇది కూడ టేబుల్ టాప్ రన్వే కావడం ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది.
టేబుల్ టాప్ రన్వేలు అంటే ఏమిటి?
కొండ ప్రాంతాలను చదును చేసి.. లేదా లోయల మధ్య ఎత్తైన పీఠభూమిపై నిర్మించే రన్వేలను టేబుల్టాప్ రన్వేలు అని పిలుస్తారు. ఇలాంటి టేబుల్ టాప్ రన్వేల చుట్టూ లోతైన లోయలు లేదా వాలుగా ఉంటాయి. ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలపై విమానాలను ల్యాండింగ్ చేసే సమయంలో పైలట్లకు పొరపాటు చేసే అవకాశాలు అస్సలు ఉండదు.
రన్వే అంచు దాటి కొంచెం ముందుకు వెళ్లినా విమానం నేరుగా లోయలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి విమానాశ్రయాలు.. ఎత్తైన ప్రాంతాల్లో ఉండటం వల్ల గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టతరంగా మారుతుంది.
బారామతి ఎయిర్పోర్ట్ లోపాలు
ఈ బారామతి విమానాశ్రయం సముద్ర మట్టానికి సుమారు 604 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరోవైపు.. బారామతి ఎయిర్పోర్టులో అత్యాధునిక ల్యాండింగ్ పరికరాలు లేకపోవడం.. అది టేబుల్టాప్ తరహా రన్వే కావడం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో పైలట్ విమానాన్ని మ్యాన్యువల్గా దింపేందుకు ప్రయత్నించినప్పుడు లెక్క తప్పడంతో విమానం రన్వే అంచును ఢీకొట్టి పేలిపోయింది.
ఈ ఘటన భారత విమానయాన రంగంలో భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపుతోంది. అంటే విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్లు పూర్తిగా తమ కళ్లపై, మ్యాన్యువల్ కంట్రోల్పైనే ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా టేబుల్టాప్ రన్వేలు కొండలపై లేదా ఎత్తైన ప్రాంతాల్లో ఉండటం వల్ల.. పైలట్లకు రన్వే వాస్తవం కంటే దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల ల్యాండింగ్ సమయంలో పైలట్లు లెక్కలు తప్పే ప్రమాదం ఉంది.
గతంలో జరిగిన ప్రమాదాలు
భారతదేశంలో టేబుల్టాప్ రన్వేల చరిత్రలో మరికొన్ని విషాదకర ఘటనలు ఉన్నాయి.
మంగళూరు (2010)
2010లో కర్ణాటక మంగళూరు ఎయిర్పోర్టులో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది దుర్మరణం చెందారు.
కోజికోడ్ (2020)
2020లో కేరళలోని కోజికోడ్లో భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్వేను దాటి 35 అడుగుల లోతు లోయలో పడి రెండు ముక్కలు అయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మరణించారు.
మన దేశంలోని టేబుల్ టాప్ రన్వేలు
కోజికోడ్ (కాలికట్) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (కేరళ)
మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (కర్ణాటక)
శిమ్లా ఎయిర్పోర్టు (జుబ్బర్హట్టి) (హిమాచల్ ప్రదేశ్)
పాక్యోంగ్ ఎయిర్పోర్టు (సిక్కిం)
లెంగ్పుయ్ ఎయిర్పోర్టు (మిజోరాం)
కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (కేరళ)
బారామతి ఎయిర్పోర్ట్ (మహారాష్ట్ర)
చిత్రకూట్ ఎయిర్పోర్ట్ (ఉత్తర్ప్రదేశ్) (నిర్మాణ దశ)
కుల్లు (భూంతర్) (హిమాచల్ ప్రదేశ్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa