ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరాకు రెడ్ టేప్

international |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 08:55 PM

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. గాజాలోని హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేసి.. ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ అప్పుడప్పుడూ వీరి మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే హమాస్‌పై యుద్ధం ప్రకటించిన బెంజమిన్ నెతన్యాహు.. ఎవరు చెప్పినా వినకుండా తనదైన శైలిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఇటీవలి కాలంలో బాగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.


ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు .. ఆ దేశ పార్లమెంటు నెస్సెట్ పార్కింగ్‌లో ఫోన్ మాట్లాడుతుండగా.. ఆయన ఫోన్ వెనుక కెమెరా లెన్స్‌లకు రెడ్ కలర్ స్టిక్కర్ అంటించి ఉండగా దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. అసలు ఎందుకు బెంజమిన్ నెతన్యాహు కెమెరా కనిపించకుండా కవర్ చేసుకున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే అది సాధారణ స్టిక్కర్ కాదని.. ట్యాంపర్ ఎవిడెంట్ సీల్ అని వెల్లడైంది. అత్యంత భద్రత కలిగి ఉండే ప్రభుత్వ ఆఫీస్‌లు, సైనిక ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ఫోన్ కెమెరాలకు వేసే స్పెషల్ సీల్ అని తేలింది.


ఆ స్టిక్కర్‌ను ఎవరైనా తీయడానికి ప్రయత్నం చేస్తే.. దానిపై ఉన్న ముద్రలు మారి అక్కడ మరకలు ఉంటాయి. దాని వల్ల ఆ ఫోన్ కెమెరాను ఎవరో ఒకరు వాడారని సెక్యూరిటీ సిబ్బంది గుర్తుపడుతుంది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి.. వాటి కెమెరా, మైక్రోఫోన్ల ద్వారా రహస్య సమాచారాన్ని రికార్డ్ చేసే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఇలా టేప్ వేస్తే.. హ్యాకర్లు కెమెరాను హ్యాక్ చేసినా వారికి అందులో నుంచి ఏమీ కనిపించదు. అంతేకాకుండా పార్లమెంట్ లోని క్లాసిఫైడ్ జోన్లలో కొన్ని రహస్య పత్రాలు, మ్యాప్‌లు ఉంటే వాటిని ఫోటోలు తీయకుండా ఉండేందుకు కూడా ఇలా టేప్ వేస్తారు. ఇటీవలి కాలంలో ఇరాన్ అనుబంధ హ్యాకర్ గ్రూపులైన హందాలా వంటి సంస్థలు.. ఇజ్రాయెల్ అధికారుల ఫోన్లు హ్యాక్ చేసినట్లు పేర్కొ్న్నాయి. దీంతో ఇజ్రాయెల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను మరింత కఠినం చేసింది.


ప్రధాని స్థాయిలో ఉన్న నెతన్యాహు వంటి టాప్ లీడర్లే తమ ఫోన్లు సేఫ్ కాదని భావిస్తుంటే.. మరి సామాన్య ప్రజలల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిఘా, గూఢచర్యానికి ఉపయోగించే పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌ తయారు చేసింది. అయితే సాఫ్ట్‌వేర్ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా కెమెరాను టేప్‌తో మూసివేయడమే అన్నింటికంటే సేఫ్ అని నిపుణులు పేర్కొంటారు. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు కూడా తమ ల్యాప్‌టాప్ కెమెరాలను ఇదే విధంగా టేప్‌లతో కనిపించకుండా మూసివేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa