దౌత్య సంబంధాలలో ఇచ్చిపుచ్చుకునే కానుకలు కేవలం వస్తువులు మాత్రమే కాదు.. అవి ఆయా దేశాల సంస్కృతికి, స్నేహానికి ప్రతీకలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అమెరికా విదేశాంగ శాఖ 2024 సంవత్సరానికి సంబంధించి విదేశీ నేతల నుంచి అందిన అధికారిక కానుకల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ఉన్నతాధికారులు అమెరికా ప్రతినిధులకు అందించిన అపురూపమైన బహుమతుల వివరాలను కూడా తెలిపింది. మొత్తంగా భారత్.. ఎన్ని బహుమతులు ఇచ్చింది, అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?
అమెరికా అధ్యక్ష దంపతులకు మోదీ నజరానాలు
ప్రధాని మోదీ నుంచి మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్లు పలు విలువైన కానుకలను అందుకున్నారు. 2024 జూలైలో మోదీ అందించిన 'స్టెర్లింగ్ సిల్వర్ మెటల్ ట్రైన్ సెట్' ఈ జాబితాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీని విలువ సుమారు 7,750 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 7.12 లక్షలు. అలాగే 2023 సెప్టెంబర్లో జీ20 సదస్సు సందర్భంగా బైడెన్కు అందించిన ఉడెన్ చెస్ట్, స్కార్ఫ్, కుంకుమ పువ్వు, టీ బాక్స్ల విలువ ఏకంగా 562 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.51 వేలు)గా ఉంది. అలాగే జిల్ బైడెన్కు అక్టోబర్ 2024లో మోదీ 'పష్మీనా శాలువా'ను బహుకరించారు. దీని విలువ 2,969 డాలర్లు (దాదాపు రూ.2.72 లక్షలు). అయితే భారతీయ చేతివృత్తుల నైపుణ్యాన్ని చాటిచెప్పే ఈ కానుకలు ప్రస్తుతం అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ (NARA)కు తరలించారు.
కమలా హారిస్, ఇతర నేతల కానుకలు..
మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు మోదీ 'లార్డ్ కృష్ణకు సంబంధించిన ఓ సిల్వర్ బాక్స్'ను కానుకగా ఇచ్చారు. దీని విలువ 1,330 డాలర్లు (సుమారు రూ.1.22 లక్షలు). ఇది మాత్రమే కాకుండా ఆమె భర్త డగ్లస్ ఎమ్హాఫ్కు 585 డాలర్ల (సుమారు రూ.53 వేల) విలువైన కఫ్లింక్స్ను అందించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పటి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు 3,700 డాలర్ల (సుమారు రూ.3.44 లక్షలు) విలువైన 'శివ నటరాజ కాంస్య విగ్రహాన్ని' బహుమతిగా ఇచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన కౌంటర్ పార్ట్ జేక్ సుల్లివన్కు 599 డాలర్ల (సుమారు రూ.55 వేల) విలువైన కాశ్మీర్ పష్మీనా స్కార్ఫ్ను బాక్స్తో సహా అందించారు.
అమెరికా చట్టాల ప్రకారం.. ఫెడరల్ ఉద్యోగులు విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న 480 డాలర్ల కంటే ఎక్కువ విలువైన కానుకల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. దౌత్య ప్రోటోకాల్ ప్రకారం.. బహుమతిని తిరస్కరిస్తే అవతలి దేశానికి ఇబ్బంది కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే వీటిని స్వీకరిస్తారు. కుంకుమ పువ్వు, టీ వంటి పాడైపోయే వస్తువులను సీక్రెట్ సర్వీస్ నిబంధనల ప్రకారం పారవేయగా.. మిగిలిన విలువైన లోహాలు, వస్త్రాలను ప్రభుత్వ నిధికి లేదా ఆర్కైవ్స్కు బదిలీ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa