ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ గ్రహీత అద్నాన్ సమీ.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ భేటీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా వీరిద్దరూ కలిసి భోజనం చేసిన ఫోటోలు బయటకు రావడంపై కాంగ్రెస్, శివసేన పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. మన దేశంపై యుద్ధం చేసిన అర్షద్ సమీ కుమారుడు అద్నాన్ సమీతో.. మోహన్ భాగవత్ భోజనం చేయడం దేశ వ్యతిరేక చర్యే అవుతుందంటూ వివరించాయి. అయితే ఈ విమర్శలపై అద్నాన్ సమీ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందిస్తూ.. ప్రతిపక్షాల నోరు మూయించారు.
అసలేమిటీ గొడవ?
ముంబైలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్.. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను అద్నాన్ సమీయే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఇవి కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. ముఖ్యంగా వీటిని చూసిన మహారాష్ట్ర కాంగ్రెస్.. తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎక్స్ వేదికగానే తీవ్ర ఆరోపణలు చేసింది. అద్నాన్ సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ 1965 భారత్-పాక్ యుద్ధంలో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా పని చేశారని, పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి చేశారని గుర్తు చేసింది. అలాంటి వ్యక్తి కుమారుడితో మోహన్ భాగవత్ విందు ఆరగించడం ఏంటని ప్రశ్నించింది. "RSS = దేశద్రోహులు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అటు సంజయ్ రౌత్ కూడా స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్ దేశానికి ఎలాంటి సందేశం ఇస్తోందని నిలదీశారు.
అద్నాన్ సమీ ఘాటు కౌంటర్..
కాంగ్రెస్ విమర్శలపై అద్నాన్ సమీ స్పందిస్తూ.. "గౌరవనీయ కాంగ్రెస్ నేతలారా.. మీ పూర్వీకులు చేసిన దేశ విభజన పాపానికి మిమ్మల్ని ఎలాగైతే బాధ్యులను చేయలేమో, నా తండ్రి గతానికి నన్ను బాధ్యుడిని చేయడం సరికాదు. చట్టబద్ధంగా మార్పులు జరిగినప్పుడు వాటిని అంగీకరించి ముందుకు సాగాలి. నేను రాజకీయ నాయకుడిని కాదు, పాటల ద్వారా ప్రేమను పంచే సంగీతకారుడిని" అని తేల్చి చెప్పారు. సంజయ్ రౌత్ విమర్శలకు కూడా అద్నాన్ సెటైరికల్గా బదులిచ్చారు. "డియర్ సంజయ్.. నువ్వు హార్మోనియం వాయించేటప్పుడు నీ వేళ్లు పెట్టే విధానం పూర్తిగా తప్పు. దాని కోసం మీ నాన్నను తిట్టడం ఎంత తప్పో.. నన్ను విమర్శించడం కూడా అంతే తప్పు. నీకు సంగీతం నేర్పడానికి నేను సిద్ధం" అంటూ ఎద్దేవా చేశారు.
మిస్టర్ భాగవత్పై ప్రశంసలు
అక్కడితో ఆగకుండా.. మోహన్ భాగవత్తో గడిపిన సమయం అద్భుతమని అద్నాన్ సమీ కొనియాడారు. ఆర్ఎస్ఎస్ గురించి సమాజంలో ఉన్న ఎన్నో అపోహలను ఆయన ఎంతో స్పష్టంగా వివరించారని, భాగవత్ ఒక గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నప్పటికీ.. కేవలం తననే టార్గెట్ చేయడంపై అద్నాన్ అసహనం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa