ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క రోజు మురిపానికి వెళ్లారా అంటూ.. వైఎస్ జగన్‌పై షర్మిల సెటైర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 07:33 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బుధవారం రోజున గవర్నర్ ప్రసంగం జరిగింది. అయితే బుధవారం అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేల తీరు, గవర్నర్ ప్రసంగం మీద ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు.


గవర్నర్ బడ్జెట్ ప్రసంగం అంత డొల్ల అని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై దశ - దిశ లేదని.. అంతా అవాస్తవాలు, కల్పితాలేనని మండిపడ్డారు. ఎన్నికల మ్యానిఫెస్టోను చదివినట్లు ఉందన్న షర్మిల.. కూటమి ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా విమర్శించారు. గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారని.. పునర్నిర్మాణం పేరుతో పబ్బం గడపడం తప్పా ప్రసంగంలో కొత్తదనం లేదని షర్మిల విమర్శించారు.


కూటమి ప్రభుత్వానికి విజన్, విజ్‌డమ్, సుపరిపాలన, సమతూకం లేదన్న వైఎస్ షర్మిల.. కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్ అయ్యాయని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీ పత్తా లేదని.. అన్నదాత సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారని అన్నారు. తల్లికి వందనం పథకం కింద 20 లక్షల మంది బిడ్డలకు మోసం చేశారని.. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్, ఆడబిడ్డ పథకానికి దిక్కు లేకున్నా.. 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామనడం హాస్యాస్పదమన్నారు.


13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలనేవి అభూత కల్పనలు అని షర్మిల విమర్శించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని చంపేశారని.. పోలవరం ఎత్తు తగ్గించారని ఆరోపించారు. అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలు చేస్తున్నారని.. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్ సిటీలంటూ.. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు.


కూటమి ప్రభుత్వం పాలన వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన అవకాశం వైసీపీకి ఉన్నప్పటికీ..ప్రతిపక్షం ఇస్తేనే సభ ముందుకు అని చెప్పడం అత్యంత సిగ్గుచేటని షర్మిల విమర్శించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది.. ఒక్క రోజు మురిపానికి కాదు కదా అని ప్రశ్నించారు. మైకు ఇస్తేనే సభకు అంటూ మారం చేయడానికి కాదు కదా అసెంబ్లీకి పంపిందంటూ సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ సొంత అజెండాను పక్కకు పెట్టి, ప్రజల అజెండాతో అసెంబ్లీకి వెళ్లాలని.. కూటమి హామీలపై, నిర్లక్ష్యాలపై సభావేదికగా నిలదీయాలని షర్మిల సూచించారు. శాసనసభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa