ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై కూలిన మెట్రో పిల్లర్... ఒకరు మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 08:35 PM

ముంబైలో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ములంద్ వెస్ట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌లో కొంత భాగం కూలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అయితే కూలిన మెట్రో పిల్లర్ ఆటో రిక్షా, ఓ కారు మీద పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో ఎల్బీఎస్ రోడ్డులోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో ఈ ఘటన జరిగింది


.ముంబై అగ్నిమాపక దళానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. మెట్రో పిల్లర్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పిల్లర్‌లోని కొంత భాగం ఊడిపడి.. కింద ప్రయాణిస్తున్న ఆటో రిక్షాపై పడినట్లు తెలిసింది.ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు, మెట్రో సిబ్బంది, వార్జు అధికారులు,108 అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో ఎల్బీఎస్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే మెట్రో పిల్లర్ కూలడానికి గల కారణంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరోవైపు చనిపోయిన వ్యక్తిని రామ్‌ధన్ యాదవ్‌గా గుర్తించారు. రాజ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్, దీపా రుహియా అనే ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో రాజ్ కుమార్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్ కుమార్ యాదవ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగతా ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. వీరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో రోడ్డుపై బారీకేడ్లు పెట్టాల్సిందని స్థానికులు మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa