ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐలో భారత్ పూర్తిస్థాయి లీడర్‌గా ఎదుగుతుందన్న శామ్ ఆల్ట్‌మన్

Technology |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 07:33 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రంగంలో భారత్ ఒక పూర్తిస్థాయి లీడర్‌గా ఎదిగే సత్తా ఉందని చాట్‌జీపీటీ సృష్టికర్త 'ఓపెన్ఏఐ' సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ప్రశంసించారు. అందుకు అవసరమైన వనరులన్నీ భారత్ వద్ద ఉన్నాయని అన్నారు. భారత్‌లో చాట్‌జీపీటీని వారానికి 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉపయోగిస్తున్నారని, ఇది తమకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అని ఆయన వెల్లడించారు.ఫిబ్రవరి 16 నుంచి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానున్న 'గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా కథనంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా తర్వాత భారత్‌లోనే తమకు అత్యధిక యూజర్లు ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థి యూజర్లు కూడా భారత్ నుంచే ఉన్నారని, శాస్త్రీయ పరిశోధనల కోసం ఉద్దేశించిన 'ప్రిజమ్' అనే ఉచిత టూల్ వినియోగంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని వివరించారు.వచ్చే వారం తాను భారత్‌లో పర్యటించనున్నట్లు ఆల్ట్‌మన్ తెలిపారు. ఏఐని "భారత్‌లోనే, భారత్‌తోనే, భారత్ కోసమే" అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గతేడాది ఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించామని, ఈ ఏడాది కార్యకలాపాలను మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఏఐ ప్రయోజనాలను అందరికీ అందించేందుకు ప్రభుత్వంతో కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ఏఐని క్షేత్రస్థాయికి చేర్చడానికి 'యాక్సెస్, అడాప్షన్, ఏజెన్సీ' అనే త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ఇటీవలే నాలుగు భారతీయ నగరాల్లో 200 మందికి పైగా ఎన్జీవో ప్రతినిధులకు చాట్‌జీపీటీ వినియోగంపై శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa