ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్మూజ్ మూసివేత వెనుక అమెరికా డ్రామా? భారత్‌ ప్రమాదంలో పడే ఛాన్స్

national |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 06:30 PM

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా అకస్మాత్తుగా నిలిచిపోయింది. కానీ, కొంతమంది విశ్లేషకులు మాత్రం దీని వెనుక అమెరికా స్కెచ్ ఉందని, గతంలోనూ ఆ దేశం ఇలాంటి డ్రామాలు అడిందని గుర్తుచేస్తున్నారు. ఇది వాషింగ్టన్ భౌగోళిక రాజకీయ వ్యూహంలో ప్రారంభ చర్య కూడా కావచ్చునని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రాంతం నుంచి ప్రయాణించే చమురు నౌకలకు యుద్ధ ప్రమాద కవరేజీని బీమా సంస్థలు అకస్మాత్తుగా ఉపసంహరించుకున్న తర్వాత అంతర్జాతీయ ఇంధన వ్యవస్థ ఎన్నడూ చూడని పరిస్థితుల్లోకి ప్రవేశించిందని ఇంధన ఆర్థికవేత్త అనాస్ అల్హాజ్జీ అన్నారు.


‘‘ముడి చమురు, శుద్ధి చేసిన ఉత్పత్తులు, సహజ వాయువులు, ఎరువులు, మిథనాల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు వంటి బహుళ ఇంధన, వస్తువుల మార్కెట్లలో మనం ఇప్పటి వరకూ అనుభవంచని పరిస్థితుల్లోకి ప్రవేశిస్తున్నాం’’ అని అల్హాజ్జీ అన్నారు. చమురు ట్యాంకర్లపై ఇరాన్ ప్రత్యక్ష దాడి ఈ సంక్షోభానికి కారణం కాదు, ఒక్క రాత్రిలోనే షిప్పింగ్ కార్యకలాపాలను స్తంభింపజేయడం అసలైన షాక్ అని ఆయన పేర్కొన్నారు.


హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ప్రమాద బీమాను అకస్మాత్తుగా ప్రపంచ, కీలక ఐరోపా బీమా కంపెనీలు రద్దుచేయడం లేదా ప్రీమియం పెంచడంతో నౌకల యజమానులు రవాణాను నిలిపివేశారని అల్హాజ్జీ చెప్పారు. ‘ఇలాంటి పరిణామాలను ఎవరూ ఊహించలేదు.. ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచం షిప్పింగ్ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ, ఇంతకు ముందు ఇలాంటివి జరగలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


ప్రపంచ ఇంధన వాణిజ్యంలో హర్మూజ్ జలసంధి అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం, సహజవాయువు రవాణాలో దాదాపు 40 శాతం దీని ద్వారా వెళ్తాయి. ఈ అంతరాయానికి ఇరాన్ సైనిక చర్య ఓ సాకు మాత్రమేనని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఎక్కువగా జరుగుతుందని అల్హాజ్జీ వాదిస్తున్నారు.


‘‘వాస్తవానికి జలసంధిలో ఒక ప్రధాన చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసి ముంచే వరకు, భీమా రద్దులు, ప్రీమియం పెంపుదల విషయంలో అంతరాయం ఏర్పడుతుంది’’ అని ఆయన అన్నారు. ఈ విషయంలో అమెరికా ప్రతిస్పందన ఆశ్చర్యకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


ట్రంప్ మౌనం ఎందుకు?


చమురు ధరలపై తరుచూగా విమర్శలు గుప్పించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. ప్రస్తుతం పరిణామాలపై మౌనంగా ఉండటం గమనార్హం. బీమా కంపెనీలు ప్రీమియం పెరుగుదల, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, ఇంధన ధరలు పెరుగుదలపై ఆయన కనీసం మాట్లాడటం లేదు. ‘ఈ బీమా ప్రీమియం పెంపుపై ట్రంప్ మౌనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. దీని వెనుక ఇరాన్‌కు వ్యతిరేకంగా విస్తృత ప్రచారంలో భౌగోళిక రాజకీయ, ఆర్థిక లక్ష్యాలు ఉండొచ్చే అనుమానాలకు తావిస్తుంది’ అని అల్హాజ్జీ వ్యాఖ్యానించారు. గతంలో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అనుసరించిన వ్యూహాన్ని పునరుద్ధరించడం ఇందుకు కారణం.


పరిస్థితి మరింత దిగజారితే, అమెరికా నేవీ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు, LNG ట్యాంకర్లకు రక్షణ కల్పిస్తుందని ట్రంప్ అన్నారు. ఈ చర్య 1980ల నాటి ట్యాంకర్ ఎస్కార్ట్ కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అమెరికా నావికా దళాలు కువైట్ ట్యాంకర్లను రక్షించాయి. ఆ పరిస్థితి ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అన్నారు. సైనిక రక్షణ ముప్పును తగ్గిస్తుంది కానీ, ఇదే సమయంలో రవాణా, బీమా ప్రీమియం ఖర్చులు పెరుగుదల, జాప్యాన్ని పెంచుతుంది.


భారత్ టార్గెట్?


ఈ సంక్షోభం ప్రభావం ఇప్పటికే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై మొదలయ్యింది. భారత్‌కు అవసరమైన ఎరువుల దిగుమతుల్లో 25 శాతం హర్మూజ్ జల సంధి ద్వారానే రవాణా అవుతుంది. దేశీయ ఎరువుల పరిశ్రమ సైతం గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకునే చమురు, ఎల్ఎన్జీపై భారీగా ఆధారపడుతోంది. ముఖ్యంగా ఖతార్ నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోవడంతో వినియోగాన్ని తగ్గించాలని ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ అంతరాయం భారత్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు జరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.


‘ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా తగ్గితే అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది.. అగ్రరాజ్యం కోరుకుంటున్నది ఇదే’అని అల్హజ్జీ అన్నారు. ఈ సంక్షోభం పేద దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. సహజ వాయువు దిగుమతులు తగ్గడంతో బంగ్లాదేశ్‌లో విద్యుత్ కోతలు మొదల్యాయి. ఈజిప్టు, జోర్డాన్‌లకు ఇజ్రాయెల్ నుంచి సరఫరా నిలిచిపోయింది. ఉద్రిక్తతలు ఒకటి రెండు వారాల్లో చల్లారితే.. ముడి చమురు ధరలు బ్యారెల్ 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa