ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమేనీ మృతిపై నిరసనల వీడియోలు షేర్ ,,,,శ్రీనగర్ ఎంపీ రుహుల్లా మెహదీపై కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:13 PM

 ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతరం జమ్మూ కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా షియాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుతూ ఖమేనీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే పలువురు ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట పెట్టారు. దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలతో కేసు పెట్టారు. ఎంపీతో పాటు శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ అజీమ్ మట్టూపై కూడా కేసులు నమోదు అయ్యాయి.


పోలీసుల అభియోగాలు.. కఠిన సెక్షన్లు


లోయలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా.. ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, మాజీ మేయర్ జునైద్ అజీమ్ మట్టూ తప్పుడు వీడియోలను పోస్ట్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రతా దళాలతో జరిగిన ఘర్షణల్లో ఒక మహిళా నిరసనకారిణిపై దాడి జరిగినట్లు ఉన్న వీడియోలను షేర్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అలాగే ఎంపీ భద్రతను కూడా తగ్గించారు.


తగ్గేదే లేదంటున్న ఎంపీ..


కేసు నమోదుపై ఎంపీ రుహుల్లా కార్యాలయం ధీటుగా స్పందించింది. "ఒక దేశాధినేత అమరత్వాన్ని ఖండించే ధైర్యం లేని ఈ ప్రభుత్వం, నిజాన్ని మాట్లాడే వ్యక్తిపై కేసులు పెట్టే ధైర్యం మాత్రం చూపిస్తోంది" అని ఎద్దేవా చేసింది. ప్రభుత్వం ఆమోదించిన సంతాప సందేశాలను చదవడానికి తనను ప్రజలు ఎన్నుకోలేదని, నిజం మాట్లాడటానికే తనను గెలిపించారని రుహుల్లా స్పష్టం చేశారు. తన భద్రతను తగ్గించినా, సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినా తన గొంతును మూయించలేరని ఆయన హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా.. తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన తన తండ్రి అగా సయ్యద్ మెహదీ ముస్తఫా అడుగు జాడల్లోనే నడుస్తానని చెప్పారు. తన రక్తం ఉన్న చివరి బొట్టు వరకు ప్రజల హక్కుల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు.


మీడియా నెట్‌వర్క్‌పై కూడా పోలీసుల ఉక్కుపాదం


కేవలం రాజకీయ నేతలే కాకుండా పలు మీడియా సంస్థలు కూడా పోలీసుల ఆగ్రహానికి గురయ్యాయి. శ్రీనగర్‌కు చెందిన మూడు ప్రముఖ వార్తాపత్రికల ఫేస్‌బుక్ పేజీలను నిలిపివేశారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న పలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను గుర్తించి, వారిని సైబర్ సెల్‌కు పిలిపించినట్లు పోలీసులు వెల్లడించారు. శాంతికి ముప్పు కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa