ఇజ్రాయెల్-అమెరికాతో కొనసాగుతోన్న యుద్ధంలో తమ పొరుగు దేశాలపై చేస్తున్న దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ క్షమాపణలు చెప్పారు. క్షిపణలు, డ్రోన్లతో దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన తేల్చిచెప్పారు. పొరుగు దేశాల భూభాగాల నుంచి మాపై దాడి చేయకుంటే తాము కూడా చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు. ఈ మేరకు ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం తీసుకున్నట్టు పెజిష్కియాన్ చెప్పారు. ఆయన ఇరాన్ అధికారిక టెలివిజన్లో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. గతవారం మొదలైన యుద్ధంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న తరుణంలో ఆయన ప్రకటనతో ఉద్రిక్తతలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
పొరుగుదేశాల్లో తలెత్తిన అనిశ్చితిపై కూడా క్షమాపణలు చెప్పిన పెజిష్కియాన్.. పశ్చిమాసియాలో సంక్షోభం మరింత విస్తరించాలని తాము కోరుకోవడం లేదని ఉద్ఘాటించారు. తాము జరిపిన దాడులకు వ్యక్తిగతంగా, ఇరాన్ తరఫున పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. అయితే, అమెరికా- ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తేలేదని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు ఎప్పటికీ లొంగరని, శత్రువులు ఆ కోరికను సమాధి చేసుకోవడం మంచిదని హితవు పలికారు. తమను లొంగదీసుకోవాలనుకునేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని, తమ దేశాన్ని ఇరాన్ కాపాడుకుంటుందని పునరుద్ఘాటించారు.
ఇదిలా ఉండగా, పొరుగు దేశాలపై దాడి చేయమని పెజిష్కియాన్ ప్రకటించినప్పటికీ... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చర్చలు కొనసాగుతుండగానే.. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాలను ప్రారంభించిందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’పేరుతో దాడులకు దిగాయి. ఈ దాడుల్లో అనేక రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలను లక్ష్యంగా చేసుకోగా.. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా కుటుంసభ్యులు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలున్న దుబాయ్, అబుదాబి, ఖతార్, కువైట్, బహ్రెయిన్ సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. గతవారం ప్రతీకార దాడులతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫాలపై బాంబులు పడ్డాయి. దీంతో వీటిని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు.
సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ ఆరాంకోకు చెందిన రాస్ తనూర్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి చేసి, నష్టం కలిగింది. దీంతో సౌదీ తాత్కాలికంగా ఆ రిఫైనరీలో ఉత్పత్తి నిలిపివేసింది. ఖతార్లో అల్ ఉదైద్ ఖతారీ బేస్పై దాడిచేసింది. తమపై 14 బాలిస్టిక్ క్షిపణలు, నాలుగు డ్రోన్లు ఇరాన్ ప్రయోగించిందని ఖతార్ తెలిపింది. ఇక, ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జల సంధిని కూడా మూసివేసింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa