ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 5 మాత్రమేనా?

international |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 07:33 PM

పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ చమురు ధరలను ప్రభావితం చేస్తోంది. మరో రెండు వారాలు ఇలాగే కొనసాగితే ముడి చమురు బ్యారెల్ 150 డాలర్లకు చేరుకుంటుందనే భయాందోళనలు నెలకున్నాయి. అయితే, చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఇరాన్.. తన దేశ ప్రజల కోసం భారీ సబ్సిడీలను భరిస్తుంది. ఆర్థికంగా దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. తన పౌరులకు మాత్రం ఇబ్బంది లేకుండా నామమాత్రపు ధరకే ఇంధనం అందజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగి సామాన్యులు అల్లాడుతుంటే, ఇరాన్‌లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 2 నుంచి రూ. 5 మధ్యలోనే ఉంటుందంటే నమశక్యంగా లేదు కదా?. ప్రభుత్వం నష్టాన్ని భరించి మరీ ప్రజలకు ఇంధనాన్ని దాదాపు ఉచితంగా అందిస్తోంది. ఇది ఆ దేశం తన సొంత నిల్వలపై ఎంతలా ఆధారపడుతుందో, ప్రజలకు ఎంత భరోసా ఇస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ.


మన దగ్గర ధరలు ఎందుకు ఆకాశంలో ఉన్నాయి?


ఇరాన్‌తో పోలిస్తే మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. దీనికి ప్రధానంగా రెండు పెద్ద అడ్డంకులు ఉన్నాయి. మొదటిది, మన చమురు అవసరాల్లో దాదాపు 80 శాతానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దీనికి తోడు డాలర్ విలువతో పోలిస్తే రూపాయి బలహీనపడటం, రవాణా ఖర్చులు పెరగడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రెండోది మనం చెల్లించే ధరలో సగం దాదాపు పన్నుల రూపంలోనే ఉంటుంది. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల వ్యాట్ కలిపి లీటరుపై దాదాపు 40 నుంచి 50 శాతం భారాన్ని సామాన్యుడిపైనే వేస్తున్నాయి.


యుద్ధం ముదిరితే.. పెట్రోల్ రూ. 110 దాటడం ఖాయమా?


ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థకు గుండెకాయ లాంటి 'హర్మూజ్ జలసంధి'లో రవాణా నిలిచిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో 'బ్రెంట్ క్రూడ్' ధరలు ఇప్పటికే పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగి సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర త్వరలోనే రూ. 110 మార్కును సులభంగా దాటేయవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


సామాన్యుడిపై 'చైన్ రియాక్షన్'


ఇంధన ధరల పెంపు అనేది కేవలం వాహనదారుడికి మాత్రమే కాదు, మొత్తం సామాజిక ఆర్థిక వ్యవస్థకే పెను సవాల్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ ప్రభావం కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు, పప్పుల ధరలపై పడుతుంది. ఇది నేరుగా ద్రవ్యోల్బణానికి దారితీసి, సామాన్యుడి చేతిలో చిప్ప తప్ప ఏమీ మిగల్చని పరిస్థితిని సృష్టించవచ్చు. మొత్తానికి, ప్రపంచ రాజకీయాల్లోని చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా మన వంటింటి పొయ్యి మీద ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ యుద్ధ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa