ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.50 లక్షలు వేతనం వద్దని సివిల్స్.., 23 ర్యాంక్‌తో తండ్రి కలను నిజం చేసిన జశ్వంత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 07:53 PM

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌-2025 తుది ఫలితాల్లో అభ్యర్థులు ప్రతిభ చాటారు. రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 40 మందికిపైగా సర్వీస్‌లకు ఎంపికయ్యారు. తొలి 100 లోపు ర్యాంకుల్లో మాత్రం ఈసారి ఇద్దరే నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన శ్రీజశ్వంత్‌ చంద్ర 23వ ర్యాంకు రాగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజనదే. ఆమె 55వ ర్యాంకు సాధించారు. అయితే 23వ ర్యాంకు సాధించిన జశ్వంత్ చంద్ర సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తినిస్తోంది. ఐఏఎస్ లక్ష్యంగా సివిల్స్‌కు సిద్ధమైన జశ్వంత్ చంద్ర ఐదుసార్లు ప్రయత్నించారు.. ఆరోసారి ఐఏఎస్ అయ్యారు. అయితే అంతకముందే 2023లో ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లోని వల్లభ్‌భాయ్‌పటేల్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్‌లో ఉన్నారు.


కాకినాడ జిల్లాకు చెందిన గొల్లపల్లి నాగకలక్ష్మి, మాణిక్యాలరావుల కుమారుడు జశ్వంత్. సొంతూరు జగ్గంపేట కాగా.. జశ్వంత్‌ తల్లి నాగలక్ష్మి టీచర్ కావడంతో కాకినాడలో ఉంటున్నారు. ఆమె కాకినాడ జిల్లాలోని వాకలపూడి జెడ్సీ హైస్కూల్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌)గా పనిచేస్తున్నారు. జశ్వంత్ తండ్రి మాణిక్యాలరావు ఐదేళ్ల క్రితం చనిపోయారు. జశ్వంత్ ఐఏఎస్ కావాలని తండ్రి కోరిక. జశ్వంత్ తాతయ్య, మేనమామల దగ్గర ఎక్కువ ఉన్నారు. జశ్వంత్ తాతయ్య లక్ష్మణరావు కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.


జశ్వంత్ కాకినాడలోని ఆశ్రం స్కూల్‌లో పది వరకు చదివారు.. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ చదివారు. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. బీటెక్ పూర్తికాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలోలో జశ్వంత్‌ ఎంపికయ్యారు. సామ్‌సంగ్ కంపెనీలో ఏడాదికి ఏకంగా రూ.50 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. జశ్వంత్ మాత్రం సివిల్స్ వైపు అడుగులు వేశారు. 2020లో తొలిసారి ప్రయత్నం చేశారు.. కానీ మెయిన్స్ దగ్గర ఆగిపోయారు. 2021లో మరోసారి ప్రయత్నం చేయగా.. 314 ర్యాంకు వచ్చింది. అప్పుడు ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగంలో చేరారు.. కానీ ఆ తర్వాత వదిలేశారు.


2022లో ఇండయిన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది.. ఫారెస్ట్ సర్వీస్‌లో కూడా ర్యాంకు వచ్చినా ఉద్యోగంలో చేరలేదు. మళ్లీ 2023లో మరోసారి యూపీఎస్సీలో 162 ర్యాంక్‌‌తో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.. హైదరాబాద్ వల్లభ్‌భాయ్‌పటేల్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో శిక్షణలో చేరారు. 2024లో మళ్లీ సివిల్స్ రాయగా.. ఇంటర్వ్యూకు వెళ్లినా ర్యాంకు రాలేదు. 2025లో మరో ప్రయత్నం చేసి అనుకున్నట్లు 23వ ర్యాంకుతో ఐపీఎస్‌క ఎంపికయ్యారు జశ్వంత్. మొత్తానికి తన తండ్రి చిరకాల కోరిక ఐఏఎస్‌ సాధించారు.. జశ్వంత్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa