ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనల్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తుండగా.. ఇదే సమయంలో ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. సమీప గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి దగ్గర చమురు, గ్యాస్ సరఫరా నౌకల్ని అడ్డుకుంటోంది. దీంతో ప్రపంచ దేశాలు.. చమురు, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నాయి. ఇదే సమయంలో క్రూడాయిల్ ధర కూడా విపరీతంగా పెరిగిపోతోంది. యుద్ధం ప్రారంభం కాక మునుపు ఫిబ్రవరి నెలలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల దిగువన ఉండగా.. ఇప్పుడు అది 100 డాలర్ల మార్కు దాటింది.
ఈ క్రమంలోనే పలు దేశాల్లో ఇప్పటికే ధరలు కూడా పెరిగిపోయాయి. పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధర 20 శాతం వరకు పెరిగాయి. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. భారత్లో ఇప్పటికే వంట గ్యాస్ ధరల్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచేశాయి. దీంతో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న భయాందోళనలు నెలకొన్నాయి.
>> 3 రోజుల కిందట ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్ల మార్కును దాటినా కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా క్రూడాయిల్ ధర మార్చి 13న 4 శాతం వరకు పెరిగి 103.86 డాలర్ల వద్ద స్థిరపడింది. ముడి చమురు ధర పెరుగుతున్నా.. మన చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయంగా ధరల్ని పెంచట్లేదు. దీంత ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలకు ప్రతి రోజూ రూ. 2 వేల కోట్లకుపైగా నష్టాలు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో త్వరలో ముడి చమురు ధర ఇదే స్థాయిలో పెరిగితే.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తుందన్న భయాలు పెరిగిపోయాయి. దీంతో ప్రస్తుతం దేశంలో మార్చి 14న పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రధాన మెట్రో నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ. 107.46 వద్ద ఉంది. డీజిల్ ధర లీటర్ రూ. 95.70 గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 103.54 గా ఉండగా.. డీజిల్ రూ. 90.03 వద్ద ఉంది. కోల్కతాలో పెట్రోల్ రూ. 105.41, డీజిల్ రూ. 92.02 వద్ద ఉంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు వరుసగా రూ. 102.99, రూ. 90.99 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.80, డీజిల్ రూ. 92.39 గా ఉంది. న్యూ ఢిల్లీలో చూస్తే ఈ రేట్లు వరుసగా రూ. 94.77, రూ. 87.67 గా ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 109 పైనే ఉండగా.. డీజిల్ ధర లీటర్ రూ. 97 పైన ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa