కుప్పంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విధ్వంసకర ఘటనకు టీడీపీ తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా గడచిన రెండు రోజులుగా అక్కడ జరుగుతున్న ఘర్షణలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం స్పందించారు. సీఎం జగన్ పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ కకావికలమైందన్నారు. కుప్పం ప్రజల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు. చంద్రబాబు సేవ చేస్తే ప్రజలు ఆయన గురించి ఆలోచిస్తారని సజ్జల అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని సజ్జల ఆరోపించారు. ముందు నుంచే ఉన్న వైసీపీ జెండాలను టీడీపీ శ్రేణులు తొలగించాయన్న సజ్జల... మా చంద్రబాబు వస్తుంటే వైసీపీ జెండాలు పెడతారా? అంటూ దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడులకు చంద్రబాబే ప్రథమ ముద్దాయి అని ఆయన అన్నారు.
గడచిన రెండు రోజులుగా అదే పనిగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతూనే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా వ్యవహరించారన్న సజ్జల.. గతంలో కూడా టీడీపీ నేతలు ఇలాగే చేశారని ధ్వజమెత్తారు. డిప్రెషన్తో చంద్రబాబు బాధ పడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa