ఫోన్ కాల్స్ తో నేరాలు ఇంకా తీవ్రంగానే మారుతున్నాయి. ప్రజలను ఎంతగా చైతన్యం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అమాయకుల్ని టార్గెట్ చేసి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. తాజాగా కలెక్టర్ ఆఫీస్ పేరుతో కొత్త తరహాలో మోసం చేస్తున్నారు. గుర్తు తెలియని అగంతకుడి చేతిలో ఏఎన్ఎం, వాలంటీర్ మోసపోయారు. అనంతపురం జిల్లా రుద్రంపేటలోని సచివాలయం–2 పనిచేస్తున్న ఏఎన్ఎం ఎర్రమ్మ, వాలంటీర్ మమతకు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను కలెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు.
కొవిడ్తో చనిపోయిన బాధిత కుటుంబసభ్యులకు అందించే పరిహారం విషయంలో ఫోన్ చేశానని.. వారి వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరాడు. ఇది నిజమని భావించిన ఏఎన్ఎం, వాలంటీర్ వెంటనే అగంతకుడు అడిగిన సమాచారాన్ని ఇచ్చారు. ఇదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలిపి.. కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే వారు అడిగిన వివరాలు అందజేయాలని చెప్పారు. వారు కూడా నిజమని నమ్మారు.
సచివాలయం సిబ్బంది చెప్పిన ప్రకారమే.. పామిడి ఓబుళమ్మ మనవరాలు భారతికి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె అవతలి వ్యక్తి అడిగిన వివరాలు అందించారు. కాసేపటికి ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.58 వేలు మాయం అయ్యాయి. అలాగే కరోనాతో మృతి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు మాధవ ఖాతాలో నుంచి రూ.46 వేల కాజేశారు. దీంతో వారు వెళ్లి ఏఎన్ఎం, వాలంటీర్ను ప్రశ్నించారు. తమ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కాజేశారని గొడవకు దిగారు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు, సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలియక చేసిన తప్పుతో ఏఎన్ఎం, వాలంటీర్ బుక్కయ్యారు. ఇదంతా సైబర్ నేరస్తుడి పనిగా పోలీసులు తేల్చారు. ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత విషయాలను చెప్పొద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa