ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సులో మంటలు.. 21 మంది సజీవ దహనం

international |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 11:55 AM

పాకిస్తాన్ లో కరాచీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సులో మంటలు చెలరేగి 21 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో M9 మోటార్ వేపై గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. మృతులంతా వరద బాధితులని.. కరాచీ నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయిందని తెలిపారు.


అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆగస్టు నెలలో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తడంతో వరద బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత చక్కబడడడంతో వారంతా తిరిగి స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సింధ్ ప్రావిన్స్ ఖైర్‌పూర్‌నాథన్ షా ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో తమ ఇళ్లకు బయలుదేరారు. ఐతే బస్సు నూరియాబాద సమీపానికి చేరుకోగానే.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. అందులో ఉన్న వారంతా ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఏసీ బస్సు కావడం.. కిటికీలన్నీ మూసి ఉండడంతో.. చాలా మంది ప్రయాణికులు బయటకు వెళ్లలేకపోయారు. మంటల్లో కాలిపోయి కొందరు.. దట్టమైన పొగతో ఊపిరాడక మరికొందరు మరణించారు.


కొంత మంది మాత్రం అతి కష్టం మీద బస్సు మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంటలు చెలరేగిన నిమిషాల వ్యవధిలోనే బస్సంతా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు కూడా వారికి సాయం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 20 మంది ప్రయాణికులు బస్సులోనే మరణించారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డ వారిని జంషోరో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఈ ఘటనతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు ప్రమాద ఘటనపై పూర్తి నివేదికను ఇవ్వాలని జంషోరో డిప్యూటీ కమిషనర్‌ను సింధ్ ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ మహమ్మద్ సోహైల్ ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa