అనుమానం పేరుతో మహిళల ప్రాణాలు తీసే సైకో భర్తల దుర్మార్గుల ఆగడాలను సభ్య సమాజం ఖండించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇలాంటి సైకో భర్తల్ని సంఘ బహిష్కరణ చేయాలని ఆమె ధ్వజమెత్తారు. ఈ మేరకు వాసిరెడ్డి పద్మ ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా తేల్చుకోవాల్సిన భార్యాభర్తల వివాదాలను ప్రాణాలు తీసే వరకు తీసుకెళ్లే పురుషాహంకార ధోరణి ఈ సమాజంలో మారాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, అనంతపురం జిల్లాలో అనుమానంతో మహిళల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ఉన్మాదుల కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు.
ఇలాంటి దుర్మార్గుల ఆగడాలను సభ్య సమాజం ఖండించాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. అనంతపురం ఘటనకు సంబంధించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ సభ్యులు షేక్ రుకియాబేగం పరామర్శించగా.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాసిరెడ్డి పద్మ ఆరా తీశారు. బాధితురాలు త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందించాలని వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. తెనాలి ఘటనపై గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ నేరస్తులపై కఠినచర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదిలావుంటే గుంటూరు జిల్లా తెనాలిలోని గాంధీ నగర్ గంటా వారి వీధిలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. కాకర్ల స్వాతి, కోటేశ్వరరావులకు 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి ఇద్దరు మగపిల్లలు సంతానం. స్వాతి స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే, భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని కొద్ది రోజులుగా భర్త కోటేశ్వరరావు వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం బ్యూటీ పార్లర్లో స్వాతిని కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అంతటితో ఆగని ఆ ఉన్మాది.. స్వాతి మృతదేహానికి రెండు పూల దండలు వేసి వెళ్లిపోయాడు.
అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న కామర్స్ లెక్చరర్ సుమంగళిపై భర్త పరేష్ కత్తితో దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. విద్యార్థులు చూస్తుండగానే లెక్చరర్పై పరేష్ దారుణానికి ఒడిగట్టాడు. మెడపై కత్తివేటు పడటంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడే పడిపోయారు. దీన్ని చూసిన విద్యార్థులు.. పరేష్ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, ఆయన అక్కడి నుంచి పరారయ్యాడు. అనుమానం కారణంగానే సుమంగళిపై పరేష్ దాడి చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa