నేరం చేశాడు అన్న నెపంతో నిధితు ఇళ్లపై బుల్డోజర్ నడుపుతున్న బీజేపీ ప్రభుత్వంపై గువహటిి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఉత్తరాది రాష్ట్రాల్లో నేరస్థులపై బుల్డోజర్లతో చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నుంచి బుల్డోజర్ల పాపులర్ అవుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వీటి వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడంపై గువహటి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బుల్డోజర్లతో కూల్చివేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదని, ఏ చట్టమూ అలాంటి అధికారాన్ని ఇవ్వలేదని తేల్చిచెప్పింది. ఎంత పెద్ద నేరానికి పాల్పడినా ఇలాంటి చర్యలు తగవని స్పష్టంచేసింది.
ఇది గ్యాంగ్వార్ దృశ్యాలను తలపింపజేస్తోందని అభిప్రాయపడింది. అసోంలోని నౌగాం జిల్లాలో ఓ నిందితుడి ఇల్లును కూల్చివేయడాన్ని గువహటి హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బుల్డోజర్ల వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ కేసులో సఫికుల్ ఇస్లాం (39) అనే చేపల వ్యాపారిని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు మే 20న అరెస్ట్ చేశారు. అతడు పోలీసుల కస్టడీలో చనిపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై.. పోలీస్ స్టేషన్కు నిప్పటించారు.
దాంతో మే 22న నిందితుడితోసహా మరో ఆరుగురి ఇళ్లను బుల్డోజర్తో అధికారులు కూల్చివేశారు. మారణాయుధాలు, డ్రగ్స్ ఉన్నాయనే ఆరోపణలతో ఈ చర్యలకు పూనుకున్నారు. ఈ చర్యలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.ఛాయ, జస్టిస్ సౌమిత్రి సైకియాల ధర్మాసనం తప్పుబట్టింది. సోదాలు నిర్వహించడానికే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, అలాంటప్పుడు ఇళ్లను బుల్డోజర్లతో ఎలా కూల్చివేస్తారని చీఫ్ జస్టిస్ ఛాయ ప్రశ్నించారు. ఏ చట్టం కూడా అందుకు అనుమతించబోదని న్యాయమూర్తి ఉద్ఘాటించారు.
‘‘రేపు మీకు ఏదైనా కావాల్సి వస్తే నా కోర్టు రూంను కూడా తవ్వుతారు’’ అంటూ పోలీసులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘దర్యాప్తు పేరుతో ఇళ్లను కూల్చివేయడానికి అనుమతి ఇస్తే ఎవరూ సురక్షితంగా ఉండరు... బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత సినిమాల్లో కనిపించే ‘గ్యాంగ్ వార్’లాంటిది.. శాంతి భద్రతలను కాపాడే పద్ధతి ఇది కాదు.. కేసుల దర్యాప్తు కోసం మెరుగైన పద్ధతులను అవలంబించాలి’’ అని సూచించారు.
చర్య కోసం ఏదైనా ముందస్తు అనుమతి తీసుకున్నారా? ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రభుత్వ న్యాయవాది ఇళ్లలో సోదా కోసం అని బదులిచ్చారు. దీంతో జస్టిస్ ఛాయ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘‘ఇన్నేళ్ల నా కెరీర్లో ఇలాంటి చర్యలు ఎప్పుడూ వినలేదు.. సెర్చ్ వారెంట్ ద్వారా బుల్డోజర్లను ఉపయోగించే పోలీసు అధికారిని నేను చూడలేదు’’ అని అన్నారు. ‘‘చాలా తీవ్రమైన విషయాన్ని ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నప్పటికీ, ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని ఏ క్రిమినల్ చట్టం అనుమతించదు’’ అని జస్టిస్ ఛాయ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa