పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అన్నట్లుగా యుద్దవాతావరణం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకొన్న ఓ ఘటన రెండు పార్టీల మధ్య మళ్లీ విమర్శలకు ఆజ్యంపోసింది. పశ్చిమ బెంగాల్లో ఓ రాజకీయ నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాజ్కుమార్తోపాటు మరో ఇద్దరు చనిపోయారు. అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.
పేలుడు కారణంగా ఇల్లు కూడా దెబ్బతిన్నట్టు అధికారులు తెలియజేశారు. అయితే "ఈ పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియ లేదు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనలో గడ్డితో కప్పబడిన మట్టి ఇల్లు ఎగిరిపోయింది." అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో బీజేపీ విమర్శలు గుప్పించింది. తృణమూల్ నాయకుడి ఇంటి దగ్గర నాటు బాంబులు తయారవుతున్నాయని, అందుకే ఇది జరిగిందని బీజేపీ ఆరోపించింది.
ఈ పరిణామంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందని విమర్శించారు. అలాగే దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉన్నారని సీపీఐ (ఎం) సీనియర్ నేత సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు. అయితే ప్రతిపక్షాల విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. పశ్చిమ బెంగాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు చాలా తేలిక అని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అన్నారు.
ఇదిలావుంటే వచ్చే ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా దేశంలోని బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారని టీఎంసీ నేతలు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa