నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తీవ్ర విషాద ఘటన జరిగింది. టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుని పలువురు మరణించారు. దీనిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు నిండు ప్రాణాలు త్యాగం చేశారని చెబుతూ, సభను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధిరాత ఇలా ఉందని తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు చనిపోయినట్టు తెలిసిందని చంద్రబాబు వెల్లడించారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు.
మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ప్రకటించారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని, ఎప్పుడు కందుకూరు వచ్చినా ఆసుపత్రి సెంటర్ లోనే సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదని, దీన్ని సంతాప సభగా భావించి, మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని తెలిపారు. అనంతరం సభను అర్థాంతరంగా ముగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa