పండుగలు ముగ్గురు చిన్నారులకు శాపంగా మారాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్కూల్లో వేసిన భోగి మంటలు.. విద్యార్థుల ప్రాణాల మీదకు వచ్చాయి. ముగ్గురు చిన్నారులు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని గొల్లవిల్లిలో ప్రైవేట్ పాఠశాల ‘విజ్డమ్’లో బుధవారం (జనవరి 11) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేశారు. విద్యార్థులందరూ ఆ మంటల చుట్టూ చేరి కేరింతలు కొడుతుండగా.. సిబ్బంది ఆ మంటలపై పెట్రోలు చల్లినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ముగ్గురు విద్యార్థులకు వ్యాపించాయి. కాలిన గాయాలతో పిల్లలు తల్లడిల్లుతుండటం చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తున్నాయి.
ఈ ఘటనలో రెండో తరగతి, మూడో తరగతికి చెందిన ఇద్దరు బాలికలు, యూకేజీకి చెందిన బాలుడు గాయపడ్డారు. వీరిని అమలాపురంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియగానే.. మంత్రి పినిపె విశ్వరూప్, ఎంపీ అనురాధ, జిల్లా కలెక్టర్.. ఆస్పత్రికి వెళ్లి పిల్లలను, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు విద్యార్థులకు పొట్ట భాగంలో, కాలిపై గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. శీతాకాలం కావడంతో గాయాలు మానేంత వరకూ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, గాయాలు మానేందుకు సమయం పడుతుందని తెలిపారు. సాధారణంగా సంక్రాంతి సందర్భంగా పాఠశాలల్లో ముగ్గుల పోటీలు, ఇతర పోటీలు పెడతారు. భోగి మంటలు లాంటి కార్యక్రమాలకు అధికారులు అనుమతి ఇవ్వరు. విజ్డమ్ పాఠశాలలోనూ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు వేయడం ఇదే తొలిసారని పాఠశాల డైరెక్టర్ రాంబాబు చెప్పారని ఎంఈవో తెలిపారు. గాయపడిన పిల్లలకయ్యే ఖర్చును ఆయనే భరిస్తున్నారని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa