ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు: మంత్రి ఆర్.కె.రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 11:30 PM

కుప్పంలో దొంగ ఓట్ల సాయంతోనే చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని ఏపీ మంత్రి ఆర్.కె.రోజా విమర్శించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన దొంగ ఓట్లతో ఇన్నాళ్లూ గెలిచారని.. ఇప్పుడు ఆ ఓట్లు పోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజలు తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. అలాగే, చిత్తూరు ఎంపీ సీటు కూడా దొంగ ఓట్లతోనే గెలుస్తున్నాడని ఆరోపించారు.


ఇక, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ది యువగళం కాదని.. తెలుగుదేశం పార్టీకి మంగళం పాడే కాలమని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లోకేష్ వార్డు మెంబర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు చాలా చాలా తక్కువ అని చురకలంటించారు. తండ్రి ముఖ్యమంత్రి, తాను మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయారంటే లోకేష్ కంటే వేస్ట్ లీడర్ ఎవరు ఉండరని వ్యాఖ్యానించారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు.


ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ది యువ శక్తి కాదు ముసలి శక్తి అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి ఆ కులం వాళ్లందరినీ రోడ్డు మీద వదిలేశారని.. మళ్లీ ఇప్పుడు ఆయన తమ్ముడు మరో పార్టీ పెట్టి మరోలా డ్రామా ఆడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వెనక ఉండేవారంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


2019లో కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికే పోటీ చేశాడేమోనని మంత్రి రోజా అనుమానం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి లక్షలాది ఉద్యోగుల ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa