షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వారిని రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎస్సీల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్లో విజయవాడలో భారీ బహిరంగ నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసి.. అభివృద్ధిని విస్మరించి ఓ కార్పొరేట్ కంపెనీ తరహాలో వ్యవహరిస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తొండియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ 48 గంటల దీక్ష చేపట్టిందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని.. జగన్ ప్రభుత్వంపై గట్టిగా గళమెత్తే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. జగన్ సర్కారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తూ.. ట్రేడింగ్ కంపెనీ మాదిరిగా తయారైందని దుయ్యబట్టారు.
ఏపీలో 2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఎస్సీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని వివరించారు. ఇక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనతో భాజపా పనిచేస్తోందని గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తొండియా తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa