గెలుపు సునాయాసమని భావిస్తున్న వైసీపీకి మాత్రం జిల్లాలలో వర్గ పోరు కొంపముంచేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. అవనిగడ్డ వ్యవహారం సీఎం కార్యాలయానికి చేరింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పీఏ శివపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, ఆయన తనయుడు వికాస్ భౌతికంగా దాడి చేయడం కలకలం రేపింది. బందరులో ఎంపీ, ఎమ్మెల్యేకు పొసగడం లేదు. తాజాగా అవనిగడ్డ రాజకీయాలు కూడా భిన్నంగా మారాయి. దీనికి కారణాలు ఉన్నట్లు తెలిసింది. ఆధిపత్య పోరులో భాగంగానే ఇక్కడ దాడులు జరిగినట్లు తెలిసింది. గత ఏడాది అవనిగడ్డ లో షరతులు గల పట్టాల పంపిణీకి సీఎం వచ్చిన సందర్భంగా.. ఎంపీ అనుచరుడు శివ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు శివ టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ పీఏగా అవనిగడ్డ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా పేకాట శిబిరం కూడా నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిలో ఒక నిందితుడిని పోలీసులు పట్టుకుంటే ఎంపీ వర్గీయులు విడిపించారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పోలీసులు ఎమ్మెల్యేకు చెప్పారని.. అప్పటి నుంచి ఎమ్మెల్యే సిహాంద్రి రమేష్ ఆయన తనయుడు మరింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
శనివారం నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్ రాక సందర్భంగా.. ఆయన ముందే భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై నాబార్డు ఛైర్మన్ కూడా అసహనం వ్యక్తం చేశారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఎమ్మెల్యే సహనంతో ఉండాల్సిందని.. ఎంపీ అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వడంతో.. పిలిచి మాట్లాడతామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే బందరు పంచాయితీలో ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తాజాగా.. ఈ వ్యవహారం సీఎం వద్దకు చేరింది. దీనిపై సీఎం జగన్ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa