ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇది కాస్త సెటైర్ల రూపం దాల్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం హాట్ హాట్గా మారింది. ఓవైపు లోకేష్ పాదయాత్ర, మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతున్న సమయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జగనన్న చేదోడు పథకం మూడో విడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. తన రాజకీయ ప్రత్యర్థులకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. పనిలో పనిగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు కు కొత్త పేరు పెట్టారు.
'రాష్ట్రంలో తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి.. గత పాలనలో ఓ గజదొంగల ముఠా ఉండేది.. దోచుకో పంచుకో, తినుకో అనేదే వీరి పాలసీ.. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు.. గతంలో ఒక ముసలాయనను ముఖ్యమంత్రిగా చూశాం. గతంలో ఎందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు' అని సీఎం జగన్ (ప్రశ్నించారు. అయితే.. గతంలో చంద్రబాబును విమర్శించే సమయంలో.. 'ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు' అని సంబోధించే జగన్.. తాజాగా.. 'ముసలాయన' అంటూ సెటైర్లు వేశారు. దీంతో సభలో కేరింతలు వినిపించాయి.
'ఎక్కడా వివక్షకు, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోంది. గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదు. గ్రోత్ రేటులో దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నాం. దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేల సాయం అందిస్తున్నాం. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ మూడేళ్ల కాలంలో రూ.927 కోట్లు లబ్ధిదారులకు అందించాం' అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa