ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచు దుప్పటి కప్పేసినట్లుగా.... కనువిందుచేసిన పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌

national |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:24 PM

దేశంలో చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను చూస్తే అర్థమవుతుంది.  కేదార్నాథ్ ను మంచు దుప్పటి కప్పేసింది. గత రాత్రి నుంచి అక్కడ మంచు కురుస్తోందని అధికారులు తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయం, దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అక్కడి కొండలన్నీ మంచు దుప్పటిని పరుచుకొని శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిచోట్ల హిమపాతం వర్షంలా కురుస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. పలు మార్గాల్లో రహదారులు మూసుకుపోయాయని, సూచనలను గమనిస్తూ ప్రయాణాలు సాగించాలని ప్రకటన జారీ చేశారు.


‘వర్షం, మంచు కారణంగా గంగోత్రి జాతీయ రహదారిపై ధారసు బంద్, బందర్‌కోట్ సమీపంలో రహదారిపై శిథిలాలు మేట వేశాయి. యమునోత్రి జాతీయ రహదారిపై జాంకిచట్టి, రాడి టాప్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు బ్లాక్ అయ్యింది. దయచేసి జాగ్రత్తగా ప్రయాణించండి’ అని ఉత్తరకాశీ పోలీసులు సూచించారు.


చార్ ధామ్‌గా పేరున్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ప్రాంతాలను ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఏటా శీతాకాలంలో ఈ ఆలయాల తలుపులు మూసుకుంటాయి. తిరిగి పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత పర్యాటకులను అనుమతిస్తారు. ఈసారి కేదార్‌నాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 26న, గంగోత్రి, యమునోత్రి తలుపులు ఏప్రిల్ 22న తెరుచుకుంటాయని ఆలయ కమిటీలు జనవరి 27న తెలిపాయి.


బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 27 నుంచి తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి తలుపులు తెరిచే తేదీలను ప్రకటించడంతో ‘చార్ ధామ్ యాత్ర’కు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు భక్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa