జగన్, వైసీపీ పని అయిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఓటమి తథ్యమని... జగన్ శంకరగిరి మాన్యాలకు పోవడం తథ్యమని స్పష్టం చేశారు. వైసీపీ పట్ల అన్ని వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతులు రగిలిపోతున్నారని, మహిళలు మందుబాబులు మండిపోతున్నారని తెలిపారు. ఉద్యోగులు ఉడికిపోతున్నారని, యువత రగిలిపోతున్నారని అన్నారు. సర్పంచులు సలసల కాగిపోతున్నారని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరాశ నిస్పృహతో ఉన్నారన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల, అరాచక, అవినీతి, మధ్య, డ్రగ్, జూదాంధ్రప్రదేశ్గా మారిందని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, మైను, వైను, బియ్యం, ఎర్రచందనం మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్వగృహ ప్రవేశం చేయాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ లోకి కలసి రండి చేయి చేయి కలుపుదాం... రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయమని... ఆ ఆశయ సాధనకు అందరూ కలిసి కృషి చేద్దామని తులసిరెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa