వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు విధానాన్ని అమలులోనికిి తీసుకురావాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలోని రిటైల్ మద్యం దుకాణాలలో డిజిటల్ చెల్లింపులను త్వరలో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దీన్ని నిర్వహించనున్నారు. మద్యం దుకాణాలలో హార్డ్ క్యాష్ను తీసుకునేప్పుడు జరుగుతున్న తప్పిదాల నుంచి బయటపడేందుకు.. ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా వెయ్యి రిటైల్ మద్యం దుకాణాల్లో ఇది అందుబాటులోకి రానుంది.
మొదట అనుకున్న వెయ్యి షాపుల్లో నిర్వహన ఫలితాలు బాగుంటే.. ఆ తర్వాత మిగిలిన వాటికి విస్తరించే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపులను అంగీకరించే బాధ్యతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పగించనున్నారు. వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని ఏపీ ఎస్ బీసీఎల్ చెల్లించడానికి ఎస్బీఐ విధివిధానాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు, ఏపీ ఎస్ బీసీఎల్ మద్యం కొనుగోలుదారుల నుంచి హార్డ్ క్యాష్ను సేకరించి.. దానిని ఎస్బీఐ లో డిపాజిట్ చేస్తోంది. ఈ డబ్బును మరుసటి రోజు ప్రభుత్వ ఖజానాకు పంపుతుంది. నిర్ణీత సమయంలో ఆ మొత్తం ఏపీ ఎస్ బీసీఎల్ కి పంపిస్తారు.
అలా వచ్చిన డబ్బును మద్యం సరఫరాదారులు, తయారీదారులకు APSBCL చెల్లింపు చేస్తుంది. మద్యం వ్యాపారం ద్వారా రోజుకు కోట్లలో ఆదాయం వస్తుంది. ఈ మొత్తంలో దాదాపు 1 నుంచి 2 శాతం వరకు డిజిటల్ చెల్లింపులు ఉంటాయి. రోజువారీ వేతన కార్మికులు, ఆర్థికంగా బలహీన వర్గాల వంటి వినియోగదారులు ఎక్కువే ఉంటారు. వాళ్లు డిజిటల్ చెల్లింపును ఎంచుకోకపోవచ్చు. UPI QR కోడ్ని స్కాన్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన స్మార్ట్ ఫోన్ కూడా వారికి ఉండకపోవచ్చు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డిజిటల్ పేమెంట్స్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అయితే.. బ్రాండ్, వాల్యూమ్, ధర, మద్యం అవుట్ లెట్, కస్టమర్ గుర్తింపు, ఇతర వివరాల పరంగా మద్యం విక్రయాలను ట్రాక్ చేసేందుకు డిజిటల్ చెల్లింపులు సహాయపడతాయని.. ఏపీ ఎస్ బీసీఎల్ అధికారులు చెబుతున్నారు. గతేడాది నవంబర్ 21 నుంచి ఈ విధానం అమలులోకి తీసుకొస్తారనే చర్చ కూడా జరిగింది. క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ స్కాన్ తదితర డిజిటల్ చెల్లింపుల ద్వారా మద్యం కొనుగోలు చేయొచ్చు. డైరెక్ట్ నగదు లావాదేవీలు ఉంటే.. షాపుల్లో ఉండే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa