మేఘాలయలోని తురా స్టేడియంలో మోదీ నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీకి ఆ రాష్ట్రంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సర్కారు అనుమతి నిరాకరించింది. ఫిబ్రవరి 24 న షిల్లాంగ్, తురాలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజక వర్గం దక్షిణ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో మోదీ ఎన్నికల సభ నిర్వహణకు బీజేపీ అనుమతి కోరింది. కానీ, స్టేడియంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెబుతూ మేఘాలయ క్రీడా విభాగం బీజేపీ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో మెగా ర్యాలీకి బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
అయితే, రూ. 127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి కాన్రాడ్ ప్రారంభించడం గమనార్హం. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. స్టేడియాన్ని ప్రారంభించిన రెండు నెలల తర్వాత పనులు పూర్తికాలేదని ఎలా చెబుతారని నిలదీసింది. ప్రధాని ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని చెప్పడం ఏంటని? ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. మేఘాలయలో మోదీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి అక్కడి ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా విమర్శించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలు అవాక్కయ్యాయని సిన్హా ఆరోపించారు. పీఏ సంగ్మా స్టేడియాన్ని రెండు నెలల కిందట ప్రారంభించిన విషయం దేశం మొత్తానికి తెలుసని అన్నారు. డిసెంబరు 16 నాటికి స్టేడియం సిద్ధమయ్యింది.. కానీ, ఫిబ్రవరి చివరి వరకూ నిర్మాణం జరుగుతోందని ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. కాగా, 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa