రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విజయనగరం వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతి లభించింది. మెడికల్ కాలేజీలో 150 సీట్లకు అనుమతి ఇస్తూ ఎన్ఎంసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ 2023- 24 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. అలాగే, మరొక 4 కళాశాలలకు త్వరలోనే అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్ఎంసీ వెల్లడించింది.
దీనిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగాల్లో మరో మైలురాయి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల మూడో తేదీన ఎన్ఎంసీ బృందం.. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహించిందన్నారు. ఏపీ ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సిబ్బంది నియామకాలతో సహా అన్ని అంశాలపై సంతృప్తి చెంది.. ఈ ఏడాది నుంచే తరగుతులు నిర్వహించుకోవడానికి అనుమతులు మంజూరు చేసిందన్నారు.
ఇక.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం రూ.8,500 కోట్లతో.. మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని సీఎం జగన్ చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన విజయనగరం కళాశాలకు తొలి అనుమతులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో మరో నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రిల్లోనూ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేలా ఇప్పటికే అన్ని వసతులు సమకూర్చుతున్నామని తెలిపారు. ఇందుకోసం అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయా కళాశాలలకు అనుమతులు మంజూరయ్యేలా సిబ్బంది నియామకాలు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు.
అలాగే, రాష్ట్రంలో పీజీ సీట్లను గణనీయంగా పెంచుకునే విషయంలోనూ సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి విడదల రజిని తెలిపారు. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవని, ఇప్పుడు ఈ సీట్ల సంఖ్య ఏకంగా 1,249కు పెంచుకోగలిగామని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగానే ఇది సాధ్యమైందని వెల్లడించారు. ఈ ఏడాది కూడా మరో 637 సీట్ల పెంపుదలకు ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రయత్నంలో ఇప్పటి వరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa