ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిడ్డల అప్పగింతలో తారుమారైన సంతానం...పదేళ్ల తరువాత వాస్తవం వెలుగులోకి

international |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 04:53 PM

సినిమా సీన్ తాజాగా ఓ విషయంలో రిపిట్ అయింది. సంతానం కోసం సరోగసి విధానాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. పిల్లల్ని కనలేని వారికి ఈ సాంకేతికత ఓ వరంలా మారింది. అయితే, చిన్న తేడా జరిగినా జీవితాలే తలకిందులు అవుతాయి. కాదు, కాదు.. నాశనం అవుతాయి. అలాంటి ఘటనే ఒకటి చైనాలో వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ విధానం ద్వారా జన్మించిన పిల్లాడికి తమ పోలికలు ఏవీ రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. డీఎన్‌ఏ పరీక్షలు జరిపించగా.. వారి అనుమానమే నిజమైంది. ఆ తల్లిదండ్రులతో బాలుడికి ఎలాంటి జెనెటిక్ లింక్స్ లేవని తేలింది. ప్రస్తుతం ఆ బాలుడి వయస్సు 10 సంవత్సరాలు. ఈ దారుణ విషయం తెలిసిన తర్వాత బాలుడి తండ్రి ఏం చేశాడు?


ఆ వ్యక్తి భార్య 2013లో తూర్పు చైనాలోని అన్‌హుయి ప్రావిన్స్‌లోని హెఫీలో ఒక పునరుత్పత్తి కేంద్రంలో IVF ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పెరిగేకొద్దీ, తమ ఇద్దరికీ సంబంధించిన శారీరక పోలికలు లేవని దంపతులు గమనించారు. బిడ్డ ఏడేళ్ల వయసుకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు డీఎన్ఏ పరీక్షలు చేశారు. అప్పటికి రెండేళ్ల కిందటే వారు విడాకులు తీసుకున్నారు. డీఎన్‌ఏ ఫలితాలు వారిని షాక్‌కు గురిచేశాయి. వారి కుమారుడికి వారిద్దరితో జన్యుపరమైన సంబంధాలు లేవని వెల్లడైంది.


ఈ విషయం తెలియగానే సదరు పునరుత్పత్తి కేంద్రంపై కేసు వేశారు. ఆ మహిళ గర్భంలో పిండాన్ని బదిలీ చేసిన వైద్యులు.. ఆ పిండాన్ని ఎక్కడ నుంచి సంగ్రహించారో, ఎప్పుడు, ఎక్కడ పొందారో వివరాలు నమోదు చేయలేదు. ఆ పిండం ఆ జంటకు చెందినదేనా, లేదా మరొకరిదా? అని నిర్ధారించేందుకు ఎలాంటి మూలాలను కనుగొనలేకపోయారు. ఇక్కడితో ఆగిపోతుందా? కొత్త చిక్కులు తలెత్తాయి.


తమ పొరపాటు వల్ల జరిగిన నష్టానికి ఆ జంటకు పరిహారం ఇస్తామని ఆ పునరుత్పత్తి కేంద్రం ముందుకొచ్చింది. నష్ట పరిహారం ఇస్తే సరిపోదని తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బాధితుడైన ‘తండ్రి’ నిలదీస్తున్నాడు.


‘నా సొంత పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు? అసలు బతికే ఉన్నాడా? ఒకవేళ బతికి ఉంటే.. నేను అతడి ప్రస్తుత తల్లిదండ్రులను సంప్రదించాలని అనుకుంటున్నాను. నేను వారి జీవితంలో జోక్యం చేసుకోను. కానీ, నా మనసు అల్లకల్లోలంగా ఉంది. పిల్లలిద్దరూ పెద్దయ్యాక, మేము వారికి నిజం చెబుతాము’ అని ఆ తండ్రి అంటున్నారు.


ఒకవేళ ఈ ఇద్దరు పిల్లల్లో ఎవరికైనా ప్రమాదం జరిగి, బోన్ మ్యారో డొనేషన్ అవసరమైతే.. అప్పుడు పరిస్థితి ఏంటి? - ఇది ఆ తండ్రి మరో ప్రశ్న. ఈ పిల్లల బయోలాజికల్ తల్లిదండ్రులు ఎవరో తెలిసినప్పుడే బోన్ మ్యారో డొనేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. ‘దానికి మేము సిద్ధంగా ఉంటాం’ అని ఆయన చెబుతున్నారు. ఆయన ఆవేదన అరణ్య రోదనే అవుతోంది.


ప్రస్తుతం 10 ఏళ్ల ఆ బాలుడికి ఐవీఎఫ్ మిక్స్-అప్ గురించి ఇంకా చెప్పలేదని ఆ తండ్రి తెలిపాడు. తమ పునరుత్పత్తి హక్కులు, వారి జన్యు సంబంధమైన పిల్లల గుర్తింపును తెలుసుకునే హక్కును ఉల్లంఘించినందుకు ఈ జంట గత సంవత్సరం ఆ పునరుత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆసుపత్రిపై దావా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్పత్రి సదరు దంపతులకు 93,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 77 లక్షలు) చెల్లించింది.


‘నాకు పరిహారం అర్థరహితం.. సమస్యకు అది పరిష్కారం కాదు. సమాధానం దొరకని ప్రశ్నలతో నా మనసు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటిదాకా ఈ విషయం గురించి మా చెల్లికి మాత్రమే చెప్పాను. నా హృదయంలో అసౌకర్యంగా ఉన్నాను. నా కథ వినేందుకు నేను ఎవరినైనా వెతకాలి. లేకుంటే డిప్రెషన్‌కి లోనవుతాను’ అని ఆ తండ్రి అంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa