ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీని గట్టెక్కిస్తున్న కార్గో విభాగం... త్వరలో మరిన్ని జిల్లాలకు విస్తరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 05:15 PM

ఆర్టీసీ అంటేనే ఎపుడూ నష్టాల్లో అన్నది మొన్నటి వరకు మనం వింటూవచ్చిన మాట. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్గో విభాగం కాసులు కురిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో.. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ.4.10 కోట్ల ఆదాయం సమకూరింది. దూర ప్రాంతాలకు కార్గో సేవలను విస్తరించడం.. ఒకేసారి పెద్దఎత్తున సామాగ్రి తరలించడంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో భారీగా ఆదాయం వస్తోంది.


కార్గో సేవలు వినియోగించుకునే వారు.. ఆర్టీసీ బస్‌ స్టేషన్‌లోని పార్శిల్‌ కార్యాలయంలో నిర్ణీత రుసుం చెల్లించి రశీదు పొందాలి. చిరునామా, సెల్‌ నెంబర్ స్పష్టంగా రాయాలి. ఇలా అన్ని వివరాలు స్పష్టంగా ఇస్తే.. పార్శిల్‌ ఇచ్చిన 24 గంటల లోపు గమ్యస్థానానికి చేర్చుతున్నారు. ఈ విభాగంలో.. ఇప్పటికే జీపీఎస్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పార్శిల్‌ ఎక్కడ ఉంది? ఎప్పుడు అందుతుందనే వివరాలు తెలుసుకోవచ్చని చెబుతున్నారు.


ఇచ్ఛాపురం నుంచి విశాఖకు కవర్‌ పంపించాలంటే రూ.50, 10 కిలోల బరువు గల వస్తువుకు రూ.68, 10-25 కిలోల వరకు రూ.85, 25-50 కిలోల వరకు రూ.111 తీసుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడకు నేరుగా వెళ్లే బస్సులో ఇవే ధరలు అమలవుతాయి. విశాఖపట్నంలో దిగి మరో బస్సులోకి సామగ్రి మార్చితే రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


'ప్రజలు ఆర్టీసీ కార్గో సేవలు వినియోగించుకోవాలి. 24 గంటల్లో గమ్యస్థానానికి చేరేలా చూస్తున్నాం. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సేవలు విస్తృతం చేస్తాం. దూరప్రాంత బస్సుల్లో కార్గో సేవలతో ఆర్థికంగా మరింత నిలదొక్కుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రజలు ఆర్టీసీ సేవల వివరాలు తెలుసుకునేందుకు.. 73311 47260 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు' అని ఆర్టీసీ అధికారి కే.మాధవ్ వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa