గత కొన్ని రోజులుగా పల్నాడు జిల్లాలో టీడీపీ- వైఎస్సార్సీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అదికాస్త ముదిరి కొన్నిసార్లు దాడులకు, ఆపై హత్యలకు దారితీసింది. ఆస్తుల విధ్వంసానికి కూడా కారణమైంది. ఇలాంటి ఘటనలపై ప్రతిపక్ష టీడీపీ.. అధికార వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా.. మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సై.. అంటే సై.. అంటున్నారు. ఇలాంటి సమయంలో.. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జూలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్ని పరిస్థితులను వివరించారు.
బ్రహ్మారెడ్డి.. చంద్రబాబును కలవడంతో.. పల్నాడు రాజకీయం వేడెక్కింది. ఈ భేటీలో.. చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఎలా ముందుకు వెళ్లాలో చంద్రబాబు సూచనలు చేసినట్టు సమాచారం. అయితే.. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నారని.. జూలకంటి బ్రహ్మారెడ్డి చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది. వాటిని సమర్ధంగా ఎదుర్కొవాలని చంద్రబాబు సూచించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకోసం జిల్లా పార్టీ నేతల సపోర్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
ఇటీవల మాచర్ల నియోజకవర్గంలో కొన్ని ఘటనలు జరిగాయి. మిరియాల గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్తకు చెందిన ట్రాక్టర్ను కొందరు దుండగులు తగలబెట్టారు. అయితే.. అది వైఎస్సార్సీపీ వారి పనే బ్రహ్మారెడ్డి ఆరోపించారు. అంతేకాదు.. మాచర్ల నియోజకవర్గంలో.. టీడీపీ జెండాను చూస్తేనే ఎమ్మెల్యే పిన్నెల్లికి వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. అటు టీడీపీలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను వేధిస్తున్నారని.. దీనికి మూల్యం తప్పదని హెచ్చరించారు. తమ పార్టీ కేడర్పై వేధింపులకు దిగితే.. ప్రతి స్పందన ఘాటుగా ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
జూలకంటి బ్రహ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆర్కే భగ్గుమన్నారు. ఆయన బ్రహ్మారెడ్డి కాదని.. బ్రహ్మానందం అని సెటైర్లు వేశారు. ఇన్నాళ్లు ప్రశాంతంగా మాచర్ల నియోజకర్గానికి.. బ్రహ్మారెడ్డి వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జెండా చూస్తే తమకు భయం ఏంటని ప్రశ్నించారు. గతంలో రెండుసార్లు ఆయన్ను ఓడించానని.. 2024లోనూ మళ్లీ ఓడిస్తానని స్పష్టం చేశారు. దమ్ముంటే ఇద్దరం ప్రజల ముందుకు వెళ్దాం.. ఎవరేంటో ప్రజలు తేలుస్తారని పిన్నెల్లి కౌంటర్ ఇచ్చారు. ఇలా డైలాగ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మారెడ్డి.. చంద్రబాబుతో భేటీ అవ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa