అధికార్లను బొల్తా కొట్టించే ఘనులు మనదేశంలో ఉన్నారు. ఇదిలావుంటే తాను ప్రధానమంత్రి కార్యాలయం అధికారినంటూ ఓ వ్యక్తి జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగానికి మస్కా కొట్టాడు. అక్కడి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి, ఫైవ్స్టార్ హోటల్లో బస, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జడ్ ప్లస్ భద్రతతో హల్చల్ చేసి, సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల్లో పర్యటించాడు. చివరకు అతడి తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. తాము పీఎంఓ అధికారులమంటూ మాయచేసిన ముగ్గురిలో ఒకర్ని గుజరాత్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మార్చి 2న అరెస్ట్ కాగా.. దీనిని పోలీసులు రహస్యంగా ఉంచారు.
జమ్మూ కశ్మీర్ (పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కిరణ్ భాయ్ పటేల్ అనే వ్యక్తి పీఎంఓలో స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ను అంటూ తనను తాను జమ్మూ కశ్మీర్ అధికారులకు పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ నుంచి అక్కడ పర్యటిస్తున్నట్లు సమాచారం. అలాగే నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరిలోని కమాన్ పోస్టు నుంచి శ్రీనగర్లోని లాల్ చౌక్కు వెళ్లాడు. అతడు నిజంగా పీఎంఓ అధికారి అని మోసపోయిన అధికారులు.. ప్రభుత్వ ఆతిథ్యం ఇచ్చారు.
వ్యక్తిగత భద్రతాధికారిని నియమించి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సమకూర్చారు. ఇక అతడేమో తన పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. కానీ, రెండు వారాల వ్యవధిలో రెండోసారి పర్యటనకు రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేయడంతో బండారం బయటపడింది. దాంతో అతడున్న హోటల్లోనే ముగ్గుర్ని మార్చి 2న జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనిపై గుజరాత్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. గుజరాత్కు చెందిన అమిత్ హితేశ్ పాండ్యా అలియాస్ కిరణ్ భాయ్ పటేల్, జై సీతాపరా, రాజస్థాన్కు చెందిన త్రిలోక్ సింగ్లుగా గుర్తించారు. పటేల్కు వెరిఫైడ్ ట్విటర్ ఖాతా కూడా ఉంది.అతడి ఫాలోవర్లలో గుజరాత్ కు చెందిన బీజేపీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. తనకు పారామిలిటరీ బలగాలు భద్రత కల్పించిన ఫోటోలు, మంచులో నడిచిన దృశ్యాలను పోస్టు చేశాడు. ట్విటర్ బయో ప్రకారం వర్జినీయాలోని కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ, ఐఐఎం తిరుచ్చి నుంచి ఎంబీఏ, ఎంటెక్ విద్యను అభ్యసించినట్లు తెలుస్తోంది. అలాగే అందులో తనను తాను ‘థింకర్, స్ట్రాటజిస్ట్, అనలిస్ట్, క్యాంపైన్ మేనేజర్’ గా అభివర్ణించుకున్నాడు.
ఇదిలావుంటే ఇందులో రాజకీయ కుట్ర దాగుందని, పటేల్తో పాటు పట్టుబడిన ఇద్దర్నీ పోలీసులు వదిలేశారని అతడి తరఫున లాయర్ రెహాన్ గోవహర్ ఆరోపించారు. మరో ఇద్దరితో కలిసి తన క్లయింట్ జమ్మూ కశ్మీర్కు వచ్చాడని, మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి ముందు పోలీసులు అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. రెండోసారి జమ్మూ కశ్మీర్కు వెళ్లిన పటేల్.. తాను బుద్గామ్ జిల్లాలో అధికారిక పర్యటన కోసం వచ్చానని ఓ సీఐడీ అధికారిని కలవడంతో పోలీసులకు ఎక్కడో తేడా కొట్టింది. అక్టోబరు 27న తొలిసారి జమ్మూ కశ్మీర్కు వెళ్లిన అతడి.. ఆ సమయంలో తన కుటుంబాన్ని వెంటేసుకెళ్లాడు. దూధ్పథ్రీకి గుజరాత్ నుంచి మరింత మంది పర్యాటకులను రప్పించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులతో చర్చించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa