ఎట్టకేలకు రెండేళ్లకుపైగా సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా భారత్లో తన రాయబారిని నియమించింది. లాస్ ఏంజెల్స్ మేయర్గా పని చేసిన ఎరిక్ గార్సెట్టీని అంబాసిడర్గా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు సెనెట్ 52-42 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. దీంతో మరికొద్ది రోజుల్లోనే ఆయన ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి రానున్నారు. 2021 జనవరిలో కెన్నెత్ జస్టెర్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఇప్పటి వరకూ భారత్లో రాయబారిని అమెరికా ప్రకటించలేదు. అగ్రరాజ్యం ఇంత కాలంపాటు ఢిల్లీలో రాయబారిని నియమించకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
1993లో 14 నెలలపాటు అమెరికా ఢిల్లీలో తన రాయబారిని నియమించలేదు. అప్పట్లో ఏడాది కంటే తక్కువ కాలమే భారత రాయబారిగా పని చేసిన థామస్ పికెరింగ్ను మాస్కోకు బదిలీ చేశాక.. క్లింటన్ ప్రభుత్వం తదుపరి రాయబారిని నామినేట్ చేయడానికి సమయం తీసుకుంది. 1993 మార్చి నుంచి 1994 ఆగస్టు మధ్య అమెరికా విదేశాంగ అధికారి ఒకరు అదనంగా భారత రాయబారి బాధ్యతలను పర్యవేక్షించారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంతగానో మారిపోయాయి. భారత్ ఇప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవుతున్నాయి.
అయినప్పటికీ ఇంత కాలంపాటు భారత్కు రాయబారిని నియమించకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. దీనికి అమెరికాలోని అంతర్గత రాజకీయాలే కారణం. వాస్తవానికి గార్సెట్టీని 2021 జులై 9నే అధ్యక్షుడు జో బైడెన్ భారత రాయబారిగా నియమించారు. కానీ సెనెట్ ఆమోదం పొందడానికి 20 నెలల సమయం పట్టింది.
డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గార్సెట్టీ.. బైడెన్కు విశ్వాసపాత్రుడు. బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు ఓ దశలో బైడెన్ కేబినెట్లోనూ చోటు దక్కుతుందని భావించారు. గార్సెట్టీ అమెరికా నేవీలో అధికారిగా 12 ఏళ్లపాటు పని చేశారు. 2013లో లాస్ ఏంజెల్స్ మేయర్గా ఎన్నికయ్యారు. లాస్ ఏంజెల్స్ వందేళ్ల చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, తొలి యూదు జాతీయుడిగా ఎరిక్ రికార్డ్ క్రియేట్ చేశారు. తొమ్మిదేళ్లపాటు ఆయన మేయర్గా పని చేశారు.
గార్సెట్టీ కీలక సహాయకుడైన రిక్ జాకబ్స్పై 2020లో ఓ కేసు నమోదైంది. జాకబ్స్ తనను అనుచితంగా తాకారని, లైంగికంగా వేధించారని గార్సెట్టీ బాడీగార్డ్ అయిన మాథ్యూ గాజ్రా ఆరోపించారు. దీంతో జాకబ్స్ తన విధుల నుంచి తప్పుకున్నారు. జాకబ్స్ ఇలా చేసిన విషయం తనకు తెలీదని గార్సెట్టీ నొక్కి చెప్పారు. కాగా ఆయన ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. విషయం ఆయనకు తెలిసినప్పటికీ.. స్పందించి, చర్యలు తీసుకోలేదని లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తన టీమ్లో ఏం జరుగుతోందో కూడా మేయర్కు తెలీదా అని నిలదీశాయి. ఈ వివాదం కారణంగానే గార్సెట్టీకి కేబినెట్ పదవి దక్కకుండా పోయింది.
భారత రాయబారిగా గార్సెట్టీ నియామకానికి గత ఏడాది జనవరిలోనే సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. కానీ జాకబ్స్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అమెరికా సెనెటర్ చక్ గ్రాస్లీ ఈ నిర్ణయాన్ని నిలిపి ఉంచారు. దీంతో ఏకగ్రీవంగా గార్సెట్టీ నియామకానికి వీల్లేకుండాపోయింది. రిపబ్లికన్లు సైతం ఆయన నామినేషన్ను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గార్సెట్టీ ప్రాథమిక నామినేషన్ తప్పిపోగా.. బైడెన్ ఈ ఏడాది ఆరంభంలో మరోసారి నామినేట్ చేయాల్సి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa