బాపట్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా అని బాపట్ల మునిసిపల్ కమిషనర్ భాను ప్రతాప్ అన్నారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి మూడు వసంతాలను పూర్తి చేసుకోవడంతో పాటు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా భాను ప్రతాప్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చిన్న - పెద్ద వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ, తనదైన ప్రత్యేక శైలితో పని చేస్తూ రాష్ట్రస్థాయిలోనే బాపట్ల పురపాలక సంఘాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన సమర్థవంతమైన అధికారిగా ఎ. భాను ప్రతాప్ సత్తా చాటారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా విలయతాండవంతో తలెత్తిన అనేక సవాళ్లను ఓర్పుతో అధిగమించాము. ఓ వైపు సచివాలయాల ఏర్పాటు, మరోవైపు రోడ్ల విస్తరణ, జగనన్న కాలనీల ఆవిర్భావం, లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం వంటి ప్రతిష్టాత్మకమైన పనులను శాసనసభ్యులు కోన రఘుపతి సంపూర్ణ సహకారంతో ముందుకు తీసుకురాగలిగాము. నా వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన విమర్శలపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. నా వృత్తి గత జీవితంలో ఖచ్చితత్వానికే ప్రాధాన్యత ఇచ్చాను. దీనిపై ఎలాంటి విమర్శలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉంటానన్నారు.
గృహ నిర్మాణానికి అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత కాగితాలను అప్లోడ్ చేస్తే అనుమతులు వస్తాయి. ఈ విషయంలో అధికారులను ఎవరు తప్పు పట్టినా అది వారి అవివేకమే అవుతుంది. జగనన్న కాలనీల్లో సెంటున్నర భూమిని బాపట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసిన అరుదైన ఘనత ఎమ్మెల్యే కోన రఘుపతి కి దక్కుతుంది. ఇది రాష్ట్రంలోనే ప్రత్యేకం. పైగా అత్యధికంగా 3400 మందికి ఇళ్లు మంజూరు కావడం మరో విశేషం అన్నారు. వీరందరితో గృహ నిర్మాణాలు చేయించడానికి అత్యంత శ్రద్ధతో పనిచేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సాధించగలగడం పురపాలక సంఘానికి గర్వకారణం.
రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం ఈ లక్ష్యాన్ని సాధిస్తామని విశ్వాసం మాకుంది. జిల్లా కేంద్రం అయిన తరువాత శానిటేషన్ సమస్య అతి పెద్ద సవాలుగా మారిందనే మాట నిజం. దీనికి కారణం సిబ్బంది కొరత. దీని శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికే పని మొదలుపెట్టాం సాధ్యమైనంత త్వరలో పారిశుద్ధ్యన్ని పూర్తిగా మెరుగుపరుస్తామన్నారు.
ఈ మార్చి 31 లోగా ఆస్తి పన్ను కొళాయి పన్ను చెల్లించిన వారికి వడ్డీ రాయితీ అందుబాటులోకి వచ్చింది కనుక ప్రతి ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాపట్ల మీడియా మిత్రులు కూడా ఎంతో విజ్ఞత కలిగిన వారు అని నా అభిప్రాయం. ఎలాంటి ఆరోపణలపై సత్వరమే వివరణ తీసుకొని వార్తలు ప్రచురిచురించడమే దీనికి నిదర్శనం. చైతన్యవంతమైన సమాజం, విద్యావంతులు ఉన్న పట్టణం బాపట్ల. ఇక్కడి ప్రజలు నన్ను ఆదరించి అభిమానించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa