ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైద్ధాంతిక వైరుద్యాలను పక్కనబెడితేనే బీజేపీని ఓ‌డించగలరు... పీకే వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 09:18 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పలు ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీచేసే దిశగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత పనిచేయదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పారు. సైద్ధాంతిక వైరుధ్యాలతో అది అస్థిరంగా ఉంటుందని, కేవలం పార్టీలు లేదా నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం వల్ల విపక్షాల ఐక్యత సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గాంధేయ, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ ఇలా అన్ని భావజాలాల నేతలూ కలిసి వస్తేనే బీజేపీని ఓడించగలరని పేర్కొన్నారు.


ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. ‘హిందుత్వం, జాతీయవాదం, సంక్షేమం.. ఈ మూడు బీజేపీకి మూల స్తంభాలు.. ఈ మూడింటిలో కనీసం రెండింటిని ఎదుర్కోలేకపోతే.. కమల దళాన్ని వచ్చే ఎన్నికల్లో సవాల్‌ చేయలేరు.. బీజేపీ హిందూత్వ భావజాలంపై పైచేయి సాధించాలంటే.. గాంధేయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేడ్కర్‌వాదులు ఇలా అన్ని భావజాలాల నేతలు కలిసి రావాలి.. అంతవరకు వారిని ఓడించే అవకాశం లేదు. అయితే, కేవలం భావజాలాన్నే గుడ్డిగా నమ్ముకోకూడదు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు.


‘‘ప్రతిపక్ష పార్టీలు లేదా నాయకులు కలుసుకోవడం మీడియాలో చూస్తున్నారు.. ఎవరు ఎవరితో కలిసి లంచ్ చేస్తున్నారు, ఎవరిని టీకి పిలుస్తారు...అది సైద్ధాంతిక కలయిక మాత్రమే.. దీని వల్ల సైద్ధాంతిక సమీకరణ జరగదు.. బీజేపీని ఓడించే అవకాశం లేదు’’ అని చెప్పారు. కాంగ్రెస్‌తో విభేదాలు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి కూడా ఈ సందర్భంగా పీకే స్పందిస్తూ.. ‘నా లక్ష్యం.. కాంగ్రెస్ పునరుజ్జీవం.. వారి లక్ష్యం.. ఎన్నికల్లో గెలవడమే.. వారు కోరుకున్న మార్గంలో నా ఆలోచనలను అమలు చేయడానికి అంగీకరించలేదు’ అని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర విషయానికొస్తే.. దేశవ్యాప్త పాదయాత్ర ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది క్షేత్రస్థాయిలోనే తేలుతుందని వ్యాఖ్యానించారు. ‘ఆరు నెలల భారత్ జోడో యాత్రలో ప్రశంసలు, విమర్శలు కూడా వచ్చాయి.. పార్టీ అదృష్టాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర అనంతరం జరిగే ఎన్నికల్లో కొంత తేడా కనిపించాలి’ అని పేర్కొన్నారు.


బీహార్ జన్ సూరాజ్ యాత్ర మహాత్మా గాంధీ సిద్ధాంతం ఇది కాంగ్రెస్ సిద్ధాంతాన్ని పునరుద్ధరించే ప్రయత్నమని తెలిపారు. ‘ఇది బీహార్‌లో మార్పు కోసమే.. బీహార్ కుల రాజకీయాలకు, అనేక తప్పుడు కారణాలకు ప్రసిద్ధి చెందింది.. బీహార్ ప్రజల సత్తా ఏమిటో తెలియాల్సిన సమయం ఇది’ అని అన్నారు. ఇక, వ్యక్తిగత విషయానికి వస్తే చాలా సంవత్సరాలుగా దూకుడుగా ఉన్నానని అన్నారు. ‘నేను ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా దూకుడుగా ఉన్నాను.. వాస్తవానికి ప్రజలు నేను నెమ్మదిగా ఉంటాను అని భావిస్తారు.. నేను చాలా దూకుడుగా ఉన్నానని చెప్పుకునే చాలా మంది మీడియా ప్రతినిధులను హ్యాండిల్ చేశాను’ అని పీకే స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa