ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోక్సీపై రెడ్ నోటీసులు ఎత్తివేత... మండిపడ్డ కాంగ్రెస్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 09:19 PM

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని, దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ‌పై జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ తొలగించింది. తనపై జోరీ చేసిన రెడ్ నోటీసుకు వ్యతిరేకంగా లియోన్‌లోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయానికి చోక్సీ అప్పీల్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయంపై సీబీఐ (CBI) పెదవి విప్పడం లేదు. ఒకవేళ, రెడ్ కార్నర్ నోటీసు రద్దయితే ఆయన ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఇంటర్‌పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు సభ్యత్వం ఉంది.


అంతర్జాతీయ నేరస్థులకు రెడ్ నోటీసు జారీ అయినప్పుడు సంబంధిత వ్యక్తిని తాత్కాలికంగా నిర్బంధించడం, అరెస్టు చేయడం చేయవచ్చు. అనంతరం అరెస్టు చేసిన దేశంలోని చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అనేక సందర్భాల్లో అతను కోరుకున్న దేశానికి అప్పగించబడతాడు. కాగా, ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు రద్దుచేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు ప్రతిపక్ష నాయకులను వెంబడిస్తున్నప్పటికీ వాంటెడ్ వజ్రాల వ్యాపారి ప్రాణదాతను అనుమతిస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించింది.


‘మోదీ సర్కార్ కే దో భాయ్ ఈడీ, సీబీఐ. ఈ రెండు శక్తులతో ప్రధాని మోదీ ..ప్రతిపక్ష నాయకులపై ప్రతీకార రాజకీయాలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నాడు.. అయితే వారు ఇంటర్‌పోల్‌కు చోక్సీ ప్రాణాలను కాపాడేందుకు అనుమతిస్తున్నారు’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. అదే సమయంలో ఛోక్సీని ఎప్పుడు దేశానికి రప్పిస్తారో ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ‘ఐదేళ్ల కిందట పారిపోయిన చోక్సీని రప్పించడానికి ఇంకా ఎంత సమయం కావాలి?" అని ప్రశ్నించింది.


రూ.13 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి ముందు మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారు. దాదాపు 10 నెలల తర్వాత 2018లో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అయితే, రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలని కోరుతూ సీబీఐ వేసిన దరఖాస్తును చోక్సీ సవాల్ చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని చోక్సీ వాదించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. అంతేకాదు భారత్‌లోని జైళ్ల పరిస్థితి, తన భద్రత, ఆరోగ్యం గురించి అనేక సందేహాలు వ్యక్తం చేశారు.


ఈ విషయం ఐదుగురు సభ్యుల ఇంటర్‌పోల్ కమిటీ కోర్టుకు వెళ్లింది. కమీషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఫైల్స్‌ వాదనలను తిరస్కరించిన కోర్టు రెడ్ నోటీసును రద్దు చేసిందని వర్గాలు తెలిపాయి. పీఎన్బీ కుంభకోణంలో చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీపై సీబీఐ వేర్వేరుగా చార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 13 వేల కోట్ల కుంభకోణంలో చోక్సీ రూ. 7,080.86 కోట్లకు మోసగించాడని సీబీఐ ఛార్జ్‌షీట్‌లలో పేర్కొంది. నీరవ్ మోదీ రూ.6,000 కోట్లు స్వాహా చేశారని ఆరోపించింది. చోక్సీ కంపెనీలకు రూ. 5,000 కోట్లకు పైగా రుణ ఎగవేత కూడా సీబీఐ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.


2021 మేలో ఆంటిగ్వా అండ్ బార్బుడాలో అదృశ్యమమైన చోక్సీ పొరుగున ఉన్న డొమినికాలో ప్రత్యక్షమయ్యాడు. అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించడంతో అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి అతడ్ని స్వదేశానికి రప్పించేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అరెస్టైన 51 రోజుల తర్వాత జులై 2021లో అతడికి డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిరిగి అంటిగ్వాకు చేరుకున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa