ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన హుండీ ఆదాయం, బ్యాంకు వడ్డీ రేట్లు,,,రూ. 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 బడ్జెట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 02:25 PM

టీటీడీ 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,411.68 కోట్ల బడ్జెట్‌ను ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డి తో కలసి ఆ వివరాలను వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దయ, ఆశీస్సులతో ప్రపంచంలోని ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను అన్నారు.


ఫిబ్రవరి నెల 15వ తేదీ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో 2023-24 బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఆ వివరాలను వెల్లడించలేక పోయామని.. ఇప్పుడు కోడ్ ముగిసినందువల్ల వివరాలను వెల్లడించామన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని.. ఈ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.


కోవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1200 కోట్లు కానుకలు లభించేవి అన్నారు. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ.1500 కోట్ల దాకా పెరిగిందని.. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయన్నారు. భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ చేశామన్నారు. తర్వాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.


అలిపిరి నుంచి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. వేసవిలో మూడు నెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వీఐపీల రెఫరల్స్ బాగా తగ్గించాలని కోరుతున్నామన్నారు. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.


తిరుమలలో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ 5.25 కోట్లు మంజూరు చేశామన్నారు. తమిళనాడు ఊలందూరు పేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ 4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్ణయించామన్నారు. తిరుపతిలోని ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కాలేజీ పడమర వైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ. 4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశామన్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో పని చేస్తున్న సిబ్బందికి.. వారి కుటుంబ సభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ 20 చొప్పున నెలకు 10 లడ్డూలు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.


టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్లు వస్తుందని అంచనా వేశారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.990 కోట్లు వస్తుందని భావిస్తున్నారు. అంటే వడ్డీ ద్వారా ఇప్పుడు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏకంగా రూ.177 కోట్లు ఎక్కువ వస్తాయని అంచనా వేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa