ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూకుష్ పర్వతాల సమీపంలో భూకంపం,,,పాక్‌లో భారీగా నష్టం ఉంటుందని అంచనా

international |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 05:10 PM

వివిధ దేశాలను ఇటీవల కాలంలో భూకంపాలు వెంటాడుతున్నాయి. తాజాగా రాత్రి సంభవించిన భూకంపానికి పాకిస్థాన్‌లో ఇప్పటి వరకూ 9 మంది మృతిచెందగా.. మరో 160 మంది వరకూ గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.5‌గా నమోదుకాగా.. అఫ్గనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలోని 180 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు పాకిస్థాన్ వాతావరణ విభాగం తెలిపింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహత్, లక్కీ మర్వాట్ సహా పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. గుజ్రన్‌వాలా, గుజరాత్, సియాల్‌కోట్, కోట్ మోమిన్, మధ్ రంఝా, చాక్‌వాల్, కోహట్, గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం తర్వాత జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు పెడుతున్న వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారమవుతున్నాయి.


భూకంప మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, చాలా వరకూ భవనాలు నేలమట్టమయ్యాయని జియో న్యూస్ తెలిపింది. భూకంప సమయంలో రావల్పిండి మార్కెట్లలో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు ది ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ తెలిపింది. మరోవైపు, ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అప్రమత్తం చేశారు. అటు, పాక్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ సూచనలతో ఇస్లామాబాద్‌లోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.


అంతర్జాతీయ సీస్మాలాజికల్ కేంద్రం ప్రకారం.. పాకిస్థాన్‌తో పాటు భారత్, అఫ్గనిస్థాన్, తుర్కిమెనిస్థాన్, కజిఖిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిజిస్థాన్‌లో భూప్రకంపనలు నమోదయ్యాయి. పాక్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఈ ఏడాది జనవరిలో 6.3 తీవ్రతతో భూకంపం నమోదయ్యింది. 2005లో సంభవించిన భూకంపానికి పాకిస్థాన్‌లో 74 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్ చరిత్రలోనే ఇదే అత్యంత భారీ ప్రాణనష్టం కలిగించిన భూకంపంగా నిలిచిపోయింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa