తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తలు కురిపించారు. రైతుల కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన కౌలు రైతులతో పాటు రైతులకు ఎకరాకు రూ.10,000/- సాయం ప్రకటించినందుకు తెలంగాణ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం వెంటనే సహాయాన్ని ప్రకటించి రైతులకు ఊరట కలిగించాలని కోరారు.
అంతేకాదు ప్రభుత్వం ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని కోరారు లక్ష్మీనారాయణ. పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత వెంటనే ఉపశమనం, పరిహారం చెల్లించాలన్నారు. తదుపరి పంటకు రైతులకు అన్ని విధాలా సహకారం అందించాలని ఏపీ సర్కార్ను కోరారు. లక్ష్మీనారాయణ ప్రధానంగా తెలంగాణ తరహాలోనే ఏపీలో రైతులుకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో వేల ఎకరాల్లో పంట నష్టపోయింది. దీంతో సీఎం కేసీఆర్ వర్ష ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు. స్థానికంగా పర్యటించి.. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం గతంలో పంటలు దెబ్బతిన్న సమయంలో నివేదికలు పంపించినా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కేంద్రాన్ని అడిగేది లేదని.. రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీలో కూడా పం నష్టంపై చర్చ జరిగింది. ఇటీవల కురిసి వడగళ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. అవసరమైతే నిబంధనల్ని మార్చేసైనా ఆదుకోవాలన్నారు. వెంటనే పంట నష్టాన్ని నమోదు చేసి పరిహారం అందించాలని కోరారు. అలాగే రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతున్నా పట్టించుకోవడం లేదని కొందరు ఎమ్మెల్యేలు అన్నారు. పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయారని వివరించారు.
గతవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, ఈదురుగాలులు వీచాయి.. అక్కడక్కడా వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.. పంట నష్టపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. పంట నష్టంపై అంచనాలు వేసి పరిహారం అందించాలి అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa