ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో రెండు పాములు ,,,చాకచక్యంగా పట్టుకున్న భాస్కర్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 07:58 PM

తిరుమలలో పాములు కలకలంరేపాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాములు ప్రత్యక్షమయ్యాయి. వేణుగోపాలస్వామి సమీపంలోని ఓ షాపులో జెర్రిపోతు కనిపించింది.. వెంటనే గమనించి అక్కడున్నవాళ్లు టీటీడీకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్‌నాయుడు.. ఆరు అడుగుల జెర్రిపోతును పట్టుకున్నారు. మరోవైపు గాలి గోపురం దగ్గర షాపులో నాగుపాము కనిపించింది.. వెంటనే స్థానికులు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న భాస్కర్ నాయుడు ఆరు అడుగుల నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ రెండు పాముల్ని జాగ్రత్తగా అవ్వాచారి కొనలో విడిచి పెట్టారు.


ఇటీవల కాలంలో తిరుమలలో పాములు సంచరిస్తున్నాయి. కొండపై ఇటీవల కొండచిలువ కనిపించింది.టీటీడీ వేస్ట్ వాటర్ క్లీన్ ప్లాంట్ దగ్గర కొండచిలువ కనిపించడంతో భక్తులు, ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. వెంటనే భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని పామును జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ కొండచిలువ 10 అడుగులకుపైగా పొడవు ఉంది.


మరోవైపు కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వీర బ్రహ్మం అధికారులను ఆదేశించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏప్రిల్ 1 నుంచి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మతో కలిసి జేఈవో సమీక్ష నిర్వహించారు.


బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులు ఆయా ఇన్చార్జులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు జేఈవో. ఇందుకు సంబంధించి ఇప్పటికే తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. డెప్యుటేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు, వసతి, తలంబ్రాల తయారీ, అన్నప్రసాదాలపంపిణీ, పారిశుద్ధ్యం, రవాణా ఇంజనీరింగ్ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఏప్రిల్ 5న జరిగే శ్రీ కోదండరామ స్వామివారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆయన చెప్పారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని, విఐపిలు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు, స్వామివారి తలంబ్రాలు, పసుపు, కుంకుమ ఉండే బ్యాగులు ఒక పద్ధతి ప్రకారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ప్రత్యేకించి కల్యాణ వేదిక వద్ద విద్యుత్, పుష్పాలంకరణలు, ఎల్ఈడీలు, బ్యారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం, విఐపిలు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయంతో పని చేయాలన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల చిన్నపాటి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా అధికారులు తమ బృందంలోని టీటీడీ అధికారులతో నిత్యం సమన్వయంతో ఉంటూ వారికి అప్పగించిన పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర పండుగగా జరుపుతున్న శ్రీ కోదండరామ స్వామి కల్యాణాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలు,స్వామివారి కల్యాణం ఏర్పాట్లపై రోజు వారి ప్రగతి తమకు తెలియజేయాలని ఆదేశించారు.


ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై పరిశీలన అనంతరం జేఈవో , జాయింట్ కలెక్టర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ 5న పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలించారు. వాహనాల కాన్వాయ్ ఎంతవరకు రావాలి అనే అంశాలపై పరిశీలన చేశారు. కల్యాణ వేదికపై సీఎం, వీఐపీల సీటింగ్ తదితర ఏర్పాట్ల గురించి క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa