ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తైవాన్ చుట్టూ భారీగా యుద్ధ నౌకలు, విమానాలను పంపిన చైనా

international |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 10:05 PM

తైవాన్  పై  యుద్దానికి కాలుదువ్వెలా  చైనా  దేశం వ్యవహరిస్తోంది. ఇదిలావుంటే  తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటనపై గుర్రుగా ఉన్న డ్రాగన్.. స్వయంపాలిత దీవి చుట్టూ యుద్ధ నౌకలను మోహరించింది. శనివారం ప్రారంభించిన సైనిక విన్యాసాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ నౌకలతో తమపై దాడులకు చైనా రిహార్సిల్స్ చేస్తోందని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన తైవాన్.. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో విన్యాసాలు జరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుత విన్యాసాల్లో తొలిసారిగా పీఎల్ఏకి చెందిన జె-15 ఫైటర్‌ జెట్‌లు పాల్గొన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్ల నుంచి ఎగిరి తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌ (ఏడీఐజెడ్‌)లోకి ప్రవేశించాయి.


సోమవారం ఉదయంతో ముగిసిన 24 గంటల్లో మొత్తం 70 యుద్ధ విమానాలు, 11 నౌకలను తైవాన్‌ ఏడీఐజెడ్‌లో గుర్తించారు. ఏకంగా 35 విమానాలు తైవాన్‌ జలసంధిలోని మీడియన్‌ లైన్‌ను దాటినట్లు తేలింది. ఈ యుద్ధ విన్యాసాల్లో జె-15 విమానాలు వాడటం ఓ కీలక అంశాన్ని వెల్లడిస్తోంది. తైవాన్‌ను చుట్టుముట్టిన స్థితిలో దాడులు చేసేలా చైనా సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల సమయంలో తైవాన్‌పై పీఎల్‌ఏ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని ఈ విన్యాసాలు వెల్లడించినట్లు రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.


గతంలో ఎన్నడూ పీఎల్‌ఏ దళాలు ఇటువంటి విన్యాసాలు చేయలేదని, దీని వల్ల చైనా విమాన వాహక నౌకలకు, పైలట్లకు వాస్తవ పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే విషయంపై అవగాహన వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, చైనా కూడా ఈ విన్యాసాల వెనుక తన ఉద్దేశాన్ని కూడా బయటపెట్టింది. క్షిపణులతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడాన్ని తాము సాధన చేస్తున్నట్లు పీఎల్‌ఏ ఈస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ వెల్లడించిందని చైనా అధికారిక మీడియా తెలిపింది. అంతేకాదు, యుద్ద విమానాలకు పేలుడు పదార్థాలను అమర్చినట్టు వెల్లడించింది.


చైనా సోమవారం తైవాన్‌ను చుట్టిముట్టే డ్రిల్స్ చేపట్టగా.. డ్రాగన్ తమ ప్రాదేశిక జలాలుగా చెప్పుకుంటోన్న ప్రాంతంలోకి అమెరికా యుద్ధ నౌకను మోహరించింది. సంయమనం పాటించాలని చైనాకు పదేపదే పిలుపునిచ్చిన అమెరికా.. సోమవారం దక్షిణ చైనా సముద్రంలోని పోటీ ప్రాంతాల గుండా గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ మిలియస్‌ను పంపింది. ‘ఈ నావిగేషన్ ఆపరేషన్ సముద్ర హక్కులు, స్వేచ్ఛ, చట్టబద్ధమైన ఉపయోగాలను సమర్ధిస్తుంది’ అని అమెరికా నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది.


వివాదాస్పద స్ప్రాట్లీ దీవుల సమీపంలో యుద్ధ నౌక ప్రయాణించినట్టు అమెరికా పేర్కొంది. ఈ పరిణామం డ్రాగన్‌ను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ నౌక తన ప్రాదేశిక జలాల్లోకి చట్టవిరుద్ధంగా చొరబడిందని పేర్కొంది. మరోవైపు, తైవాన్‌ రక్షణ శాఖ స్పందిస్తూ వివాదాలు తలెత్తకుండా, పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా తాము ఓర్పుతో వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. అలాగే, చైనాకు ప్రతిస్పందనగా స్పీడ్‌ బోట్‌లు, తీరంలోని యాంటీషిప్‌ క్షిపణి వాహనాలతో యుద్ధ విన్యాసాలు చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa