పలాస పట్టణం సూదికొండకాలనీలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. భార్య, అత్తపై భర్త దాడి చేసాడు. వివరాల్లోకి వెళ్ళితే..... పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ జయరామ చంద్రపురం గ్రామానికి చెందిన బద్రి నాగార్జునతో యశోదకు 2011 సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. తనకు కుమార్తెలు మాత్రమే ఉన్నారని, కుమారుడు కూడా కావాలని నిత్యం ఆమెను నాగార్జున వేధించేవాడు. అప్పటికే ఆమె సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. దీంతో పిల్లలు పుట్టేందుకు విశాఖపట్నంలో ఆరు నెలల క్రితం మళ్లీ ఆపరేషన్ చేయించారు. అది వికటించడంతో యశోద అనారోగ్యం పాలైంది. అప్పటి నుంచి వీరిమధ్య తరచూ గొడవలు మరింత అధికమయ్యాయి. యశోద తల్లి మద్దిల పద్మావతి నందిగాం మండలం లట్టిగాం వాసి. ఈమె ప్రస్తుతం కుమార్తె కోసం పలాసలోని సూదికొండ కాలనీలో ఉంటోంది. యశోద కూడా తల్లి వద్దే ఉంటోంది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నాగార్జునతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి యశోదను హత్య చేసేందుకు యత్నించడంతో ఆమె తల్లి పద్మావతి అడ్డుకుంది. దీంతో యశోదకు స్వల్ప గాయాలు కాగా.. పద్మావతి కాలు విరిగిపోయింది. దీంతో ఇద్దరూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం పద్మావతి కాలిగాయం ఎక్కువ కావడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వారసుడి కోసమే తనపై భర్త నాగార్జున ఈ అఘాతుకానికి పాల్పడ్డాడని, తన కుమార్తెలిద్దర్ని కూడా అతనే తీసుకువెళ్లిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం జరిపించాలని ఆమె కోరింది. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఐతే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa