ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవో నంబర్ 52ను రద్దు చేయాలి అంటూ వైసీపీ ఎమ్మెల్యే ను అడ్డుకొన్న గిరిజనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 06:21 PM

జీవో నంబర్ 52ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగులపల్లి  ధనలక్ష్మిని ఆదివాసీ నాయకులు అడ్డుకున్నారు. బోయ, వాల్మీకీ కులాలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జగన్ సర్కారు ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో బోయలు, వాల్మీకీ సహా అనుబంధ కులాలను ఎస్టీల్లో చేర్చాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని అడ్డుకోలేని ఎమ్మెల్యేలు గిరిజన ద్రోహులంటూ నినాదాలు చేశారు. గిరిజనులకు అన్యాయం చేసే తీర్మానాన్ని ఉపసంహరించుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా తమ వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని ఆదివాసీ సంఘాల నేతలు ఎమ్మెల్యేకు సూచించారు.


మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన 3వ విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ధనలక్ష్మి వస్తున్న నేపథ్యంలో.. ఆమెను అడ్డుకుంటారనే అనుమానంతో ఆదివాసీ గిరిజన సంఘల నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. జీవో నంబర్ 52 ని రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొద్ది రోజులుగా ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం బోయలు, వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో ఆదివాసీలు ఆందోళనలను మరింత ముమ్మరం చేశారు.


ఇదిలావుంటే దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని.. బోయ, వాల్మీకీ కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని గత నెల మార్చి 24వ తేదీన శాసనసభ చేసిన రెండు వేర్వేరు తీర్మానాల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ రెండు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని తనకూ తెలుసని.. కానీ, అన్యాయానికి గురైన వారికి చేతనైనంత మంచిచేసే అవకాశం ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాలనే ఈ రెండు తీర్మానాలు చేసినట్లు వివరించారు.


దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మేరుగు నాగార్జున, బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణలు... మార్చి 24న శాసనసభలో రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దేందుకే ఈ రెండు తీర్మానాలు చేస్తున్నామని వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa