ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం,,.ఏకంగా 262 భూములు ఇచ్చేశాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 08:43 PM

తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు కొత్తేమీ కాదు.  తాజాగా ఓ భక్తుడు భారీ విరాళం అందజేసేందుకు ముందుకొచ్చారు. ఏకంగా 262 ఎకరాల భూమిని విరాళంగా ఇస్తానని తెలిపారు. బెంగళూరుకు చెందిన మురళీకృష్ణకు తిరుపతి జిల్లా డక్కిలి మండలం రేగడిపల్లిలో.. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పోతేగుంటలో కలిపి 262 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని టీటీడీకి విరాళంగా ఇస్తానన్నారు. ఈ భూములను సీఎస్ జవహర్‌రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తిరుపతి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి పరిశీలించారు. అధికారుల బృందం నీటి వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.


ఈ భూమిలో తానే స్వయంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులను పండించి టీటీడీకి అప్పగిస్తాను అన్నారు భక్తుడు. ఆ భూముల్లో ఆహార ఉత్పత్తులు, పూలు సాగు చేసి అప్పగిస్తాను అంటున్నారు. భూముల మ్యాపును పరిశీలించి.. భూముల రికార్డుల మార్పుపై రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. శ్రీవారికి అప్పగించనున్న భూముల్లో పంటలు పండించి.. ఆ ఫలసాయాన్ని అందించినప్పుడే వేంకటేశ్వరస్వామికి సేవ చేసినట్లవుతుంది అంటున్నారు.


మరోవైపు తెలంగాణ సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహూకరించారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఏపీ సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా వీటిని అందించారు. స్వామి వారికి రూ 45 వేల విలువ చేసే బంగారు చీరను అగ్గిపెట్టెలో పట్టేలా ఆయన తయారు చేయించారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా 5 గ్రాముల బంగారంతో జరీ చీర తయారు చేయించారు.


మరోవైపు తిరుమల శ్రీవారికి శనివారం ఒక బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ దంపతులు రూ.31 లక్షల విలువైన బస్సును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అలాగే జంషెడ్ పూర్ కు చెందిన సర్ లాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది. ఆ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.


తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఆదివారం సాయంత్రానికి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్‌లో ఎంబీసీ వరకు వేచి ఉండగా.. వీరికి దాదాపు 24 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.


శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు. అలాగే పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్ డి టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa