ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియా ముసుగులో వచ్చి అతిక్ సోదరులపై కాల్పులు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 16, 2023, 07:53 PM

పక్కపథకంతో ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగస్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యలు  సాగాయని తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్పత్రి వద్ద పోలీసుల భద్రతా వలయాన్ని దాటుకుని జర్నలిస్ట్‌ల వేషంలో ఏమార్చి మీడియా ప్రతినిధుల ముందే ముగ్గురు దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఇద్దరిపై తూటాల వర్షం కురిపించారు. దాంతో, అతీక్, అష్రఫ్ ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక, కాల్పులకు పాల్పడిన ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


నిందితులను బందాకు చెందిన లవ్లేశ్ తివారీ (22), కసగంజ్‌కు చెందిన మోహిత్ అలియాస్ సన్నీ పురానే (22), హమీర్‌పూర్‌కి చెందిన అరుణ్ మౌర్య (18)గా గుర్తించారు. పక్కా పథకం ప్రకారం హత్యలకు పాల్పడిన నిందితులు.. మీడియా ఐడీ కార్డులు ధరించి ఆసుపత్రిలోకి వచ్చారు. ఓ చేతిలో మైక్‌ను పట్టుకుని, ఇన్‌షర్ట్ లోపల తుపాకులను దాచిపెట్టి వచ్చినట్టు పోలీసులు విచారణలో వెల్లడించారు. హత్యలకు కారణాలపై పోలీసులు ఆరా తీయగా.. వారు చెప్పి సమాధానం విని పోలీసులు విస్తుపోయారు. ఫేమస్ అయ్యేందుకే తాము ఈ హత్యలు చేసినట్టు పోలీసులకు తెలిపారు.


అతీఖ్ అహ్మద్, అష్రఫ్‌లను పోలీసు కస్టడీకి పంపినట్లు తెలిసినప్పటి నుంచి తాము సోదరులను అనుసరిస్తున్నామని ఒప్పుకున్నారు. అయితే, హత్యలకు వేరే కారణం ఏదైనా ఉందా? నిందితుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తివారీ కుడిచేతికి గాయమైనట్టు పోలీసులు తెలిపారు. కాగా, కాల్పులకు పాల్పడిన నిందితులు చాలా కాలం నుంచి తమ కుటుంబాలకు దూరంగా ఉన్నట్టు గుర్తించారు. లవ్లేశ్ తివారీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. అతడితో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.


అప్పడప్పుడు ఇంటికి వస్తుంటాడని, ఐదారు రోజుల కిందటే బందాకు వచ్చాడని తెలిపారు. ‘అతను నా కొడుకు. ఆ సంఘటనను టీవీలో చూశాం. లవ్లేష్ చర్యల గురించి మాకు తెలియదు లేదా దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. అతను ఎప్పుడూ ఇక్కడ ఉండలేదు.. మా కుటుంబ వ్యవహారాలో పాల్గొనడు... అతను మాకు ఏమీ చెప్పలేదు. ఐదారు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. అతనితో కొన్నాళ్లుగా మాట్లాడటం లేదు. అతడిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కేసులో అతనికి జైలు శిక్ష పడింది’’ అని లవ్లేష్ తండ్రి యజ్ఞ‌ తివారీ తెలిపారు.


ఏ పనిపాటు చేయడు, డ్రగ్స్‌కు బానిస.. మాకు నలుగురు పిల్లలు ఉన్నారు. దీని కన్నా మేము ఏమీ చెప్పలేం’ అని యజ్ఞ తివారీ పేర్కొన్నారు. ఇక, సన్నీపై 14 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్‌గా ప్రకటించినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. తండ్రి చనిపోవడంతో తన పూర్వీకుల ఆస్తిలో తన వాటాను అమ్మి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఐదేళ్లుగా తన కుటుంబాన్ని కలవలేదు. తల్లిను చూసుకుంటోన్న అతడి సోదరుడు టీ స్టాల్ నడుపుతున్నాడు. జులాయిగా తిరిగే సన్నీతో మాకు సంబంధాల్లేవు.. నేరస్థుడిగా ఎలా మారాడో తెలియదు అని అతడి సోదరుడు పింటూ సింగ్ చెప్పారు.


చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిన అరుణ్.. 2010లో రైలులో ఒక పోలీసు హత్యకు సంబంధించి అతని పేరు వినిపించిందని వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ లాడ్జిలో ముగ్గురు బస చేశారు. వీరికి ఎలా పరిచయమైందో పోలీసుల దర్యాప్తులో వెల్లడికానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa