దేశంలో వందేభారత్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, కేరళలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం తిరునావయ, తిరూర్ మధ్య గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రైలు కాసర్గడ్ నుంచి తిరువనంతపురానికి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళలో తొలి వందేభారత్ రైలును ఏప్రిల్ 25న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, రాళ్లదాడిలో ఎవరూ గాయపడలేదని, ఓ బోగికి కిటికీ అద్దం పగిలిపోయిందని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై రైల్వే అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రాళ్ల దాడితో రైలును తిరూర్ సమీపంలో అధికారులు నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో తిరిగి తిరువనంతపురానికి ప్రయాణాన్ని కొనసాగించిందని, ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ‘రైల్వే అధికారులు మమ్మల్ని అప్రమత్తం చేశారు.. దుండగుల జాడ కోసం దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం రాళ్ల కారణంగా రైలు కిటికీ అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
గత నెల 6న విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలుపై కూడా ఆకతాయిలు రాళ్ల దాడికి తెగబడ్డారు. గత రెండు నెలల వ్యవధిలో ఇది మూడో ఘటన. ఖమ్మం- విజయవాడ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. దీంతో ఓ బోగీ అద్దం పగిలిపోగా.. దెబ్బతిన్న అద్దాన్ని విశాఖలో మార్చారు. ఇదే రైలుపై ఫిబ్రవరిలో కూడా ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర రాళ్ల దాడి జరిగింది. అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో.. రైలు సీ-12 కోచ్ (చైర్ కార్ కోచ్) విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది. మార్చి 12 బెంగాల్లోనూ ఆకతాయిలు వందేభారత్ రైలుపై దాడికి పాల్పడ్డారు. ముర్షీదాబాద్ జిల్లా ఫరక్కా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరినట్టు తూర్పు రైల్వే అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa