ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పదోతరగతి ఫలితాల్లో ఆరో తరగతి విద్యార్థిని సత్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 06:23 PM

పిట్టకొంచెం కూత ఘనం అన్నది వినేవుంటాం. ఈ క్రమంలోనే ఏపీ పదోతరగతి ఫలితాల్లో ఆరో తరగతి విద్యార్థిని సత్తా చాటింది. 488 మార్కులు సాధించి ఔరా అనిపించింది. అదేంటి ఆరో తరగతి విద్యార్థిని పది పరీక్షలు రాయటమేంటని ఆశ్చర్యపోతున్నారా ! అలా ఎలా అని ఆలోచిస్తున్నారా..? అవునండి.. మీరు విన్నది నిజమే ఆరో తరగతి విద్యార్థే పది పరీక్షలు రాసి 488 మార్కులు సాధించింది.


కాకినాడ జిల్లా గాంధీనగర్‌‌కు చెందిన ముప్పల సురేశ్, మణిల కుమార్తె హేమశ్రీ.. మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. హేమశ్రీ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకు. ఏం చదివినా.. ఇట్టే గుర్తుపెట్టుకుంది. ఆ చిన్నారి మెమురీ పవర్ అలాంటింది మరి. చిన్నారి టాలెంట్‌ను గుర్తించిన స్కూల్ యాజమాన్యం కొన్నాళ్ల క్రితం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది మార్చి 27న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ హేమశ్రీ తెలివితేటల్ని పరీక్షించారు. ఆమె అసమాన ప్రతిభకు ఆయన సైతం ఆశ్చర్చపోయారు. చిన్నారి ప్రతిభను మెచ్చి టెన్త్ పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అనుమతిని ఇచ్చారు. మే నెలలో పరీక్షలు రాసిన హేమశ్రీ సత్తా చాటింది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె 488 మార్కులు సాధించింది.


ఇక ఏపీ పది ఫలితాల్లో 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మెుత్తం 6,050,52 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో 4,37,196 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయి. పాసైన వారిలో బాలురు 2,14,220 (69.27 శాతం) కాగా.. బాలికలు 2,22,976 (75.38 శాతం) మంది ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతం పాస్ పర్సంటేజీతో మొదటి స్థానంలో నిలవగా.. నంద్యాల జిల్లా 60.39 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.


ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 95.25 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 53.99 శాతం మంది పాసయ్యారు. ఏపీ వ్యాప్తంగా 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తర్ణీత సాధించగా..38 పాఠశాల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. అక్కడ సున్నా ఫలితాలు వచ్చాయి. ఎయిడెడ్‌లో 7, ఆశ్రమ పాఠశాలల్లో 3, ప్రభుత్వ, జడ్పీ 6, ప్రైవేటులో 22 పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా పాస్ కాలేదు. తెలుగులో 91.53 శాతం, ఇంగ్లీష్‌లో 98.15 శాతం, హిందీలో 95.40 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మ్యాథ్స్‌లో 79.63 శాతం, సైన్స్‌లో 84.23 శాతం, సోషల్ స్డడీస్‌లో 92.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa